ఎపి రాజధానికి చిక్కులు: ల్యాండ్ పూలింగ్పై హైకోర్టు షాక్
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్కు హైకోర్టు ఆదేశాలతో ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తూ 600 మంది మంగళగిరి రైతులు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు.
తనను ఆశ్రయించిన 600 మంది మంగళగిరి రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. వారి భూములను ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయిస్తూ హైకోర్టు శుక్రవారంనాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ పొలాలను ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయిస్తూ వచ్చే వాయిదా నాటికి తమకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతుల భూములు లాక్కోవడం ఏమిటని హైకోర్టు కాస్తా అసహనం వ్యక్తం చేసింది. సిఆర్డిఎ చట్టంలో పొందుపరిచినవాటిని ఎలా ఉల్లంఘిస్తారని ప్రశ్నించింది.
ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ప్రభుత్వమే అమలు చేయకపోవడం న్యాయసమ్మతం కాదని తేల్చింది. ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తూ తమను ఆశ్రయించిన రైతులు తమ బూముల్లో నిరభ్యంతరంగా వ్యవసాయం చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. రైతుల తరపున ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు వినిపించారు.