అచ్చెన్నాయుడుకు రిలీఫ్.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి అచ్చెన్నాయుడుకి ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈఎస్ఐ స్కాంలో జరిగిన అవకతవకలపై అప్పటి మంత్రి ప్రమేయం ఉంది అని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆయన రిమాండ్లో ఉన్నారు.
కరోనాకు చికిత్స
ప్రస్తుతం ఆయన కరోనా వైరస్ కోసం ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి హైకోర్టు బెయిల్ మంజూర్ చేసింది. అయితే పలు షరతులను కూడా విధించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని అచ్చెన్నాయుడుకి కోర్టు స్పష్టంచేసింది. అచ్చెన్నాయుడికి హైకోర్టులో బెయిల్ లభించడంతో ఆయన కుటుంబసభ్యులు.. అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
స్కాం జరిగింది ఇలా..
గత ప్రభుత్వ హయాంలో టెలీ హెల్త్ సర్వీసెస్కు కాంట్రాక్ట్ ఇవ్వడంలో నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణలు వచ్చాయి. అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రమేయంతోనే రూ.150 కోట్ల స్కాం జరిగిందని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు.
ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ చేసే ఒక రోజు ముందు అచ్చెన్నాయుడికి ఫైల్స్ సర్జరీ జరిగింది. మరునాడే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి విజయవాడ తీసుకొచ్చారు. కారులో 12 గంటలపాటు తీసుకురావడంతో ఆయనకు రక్తస్రావమయ్యింది. తర్వాత కోర్టు ఆదేశాల మేరకు జీజీహెచ్లో మరోసారి శస్త్రచికిత్స చేశారు. తర్వాత కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసి విజయవాడ సబ్ జైలుకు తరలించారు. జైలులో ఉండగానే కరోనా సోకడంతో ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితులను బట్టి హైకోర్టు అచ్చెన్నాయుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Recommended Video
ఆధారాలేం లేవు..కానీ: ఏసీబీ డీజీ
పలు కంపెనీలు మంత్రి వద్దకు వస్తుంటాయని.. ఆ సమయంలో అధికారులకు అప్పటి మంత్రి సిఫారసు చేయవచ్చు... కానీ వాటిని అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులకు ఛాన్స్ ఇవ్వాలని ఏసీబీ డీజీ రవికుమార్ అన్నారు. కానీ ఆ కంపెనీలతో ఒప్పందం చేసుకోవాలని అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేయడంతో కుంభకోణం జరిగి ఉంటుందని తెలిపారు. టెండర్కు వెళ్లాల్సిన వాటికి సంబంధించి ఈ విధంగా వ్యవహరించొద్దు అని తెలిపారు. కానీ తమకు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదు అని.. విచారణ క్రమంలో లభించే అవకాశం ఉందన్నారు.