జీవో 90 కొట్టివేత, మూణ్ణెళ్లలో..: పంచాయతీ ఎన్నికలపై చంద్రబాబుకు హైకోర్టు భారీ షాక్
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 90ని కొట్టివేసింది. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
కోర్టులో సవాల్ చేసిన మాజీ సర్పంచ్లు
సర్పంచ్ల గడువు ముగియడంతో, పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమిస్తోందని, దిగువ క్యాడర్ ఉద్యోగులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తోందని మాజీ సర్పంచులు కోర్టులో సవాల్ చేశారు. వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
పవన్! నువ్వు సీఎంవు అవుతావా: చిరంజీవిని లాగిన జవహర్, సిగ్గు రాలేదా: జగన్పై ఆదినారాయణ
జీవో నెంబర్ 90ని కొట్టివేసింది
మాజీ సర్పంచ్ల పిటిషన్ పైన విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు సానుకూలంగా స్పందించింది. ప్రత్యేక అధికారుల పాలనను కొనసాగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 90ని హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు, మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. జీవో 90తో ఆగస్ట్ 1వ తేదీ నుంచి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.
నిలదీస్తున్న పవన్, జగన్
పంచాయతీ ఎన్నికల గడువు ముగిసినప్పటికీ ఏపీలో ఎన్నికలు నిర్వహించక పోవడంపై విపక్ష నేతలు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సందర్భం వచ్చినప్పుడు నిలదీస్తున్నారు.
సవాల్ చేస్తున్న విపక్షాలు
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఈ సర్పంచ్ ఎన్నికల్లో విపక్షాలు గెలిస్తే తమకు వచ్చే అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో ఇబ్బంది ఉంటుందని భావించే చంద్రబాబు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజల మద్దతు ఉందని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం దమ్ముంటే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడు ఎవరి సత్తా ఏమిటో తేలుతుందని చెబుతున్నారు.