ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడూ సాధ్యంకాదు.. రాయలసీమలో ‘హైకోర్టు’ ఉద్యమానికి ఊపు
కర్నూలు జిల్లాలో కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు నంద్యాల పట్టణం జలమయమైంది. ఎప్పుడూ లేనవిధంగా కుందునది ఉధృతంగా ప్రవహించింది. నంద్యాల తీర ప్రాంతాన్ని ముంచెత్తింది. వరద బారిన పడిన నంద్యాలలో శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనను కలుసుకున్నారు. జిల్లా బార్ అసోసియేషన్ నాయకులు వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.
ఇప్పుడు కాకపోతే మరెప్పడూ
కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలనే డిమాండ్ నెరవేరడానికి ప్రస్తుతం అన్ని రకాలుగా సానుకూల పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు కుదురకపోతే.. ఇంకెప్పుడూ సాధ్యంకాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రరాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ గా అవతరించే క్రమంలో కుదిరిన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
నిరాహార దీక్షలు 12వ రోజుకు
ఇందులో భాగంగా.. కర్నూలులో న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారం నాటితో 12వ రోజుకు చేరుకుంది. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇదే సరైన సమయమని, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేంత వరకూ తాము నిరాహార దీక్షలను కొనసాగిస్తామని జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
పెద్ద ఎత్తున ఉద్యమాలు
హైకోర్టును రాజధాని ప్రాంతంలోనే కొనసాగించాలని కోరుతూ గుంటూరులోనూ న్యాయవాదులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వారు ఇదివరకే రెండు రోజుల పాటు తమ విధులను సైతం బహిష్కరించారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా బార్ అసోసియేషన్లు జేఏసీగా ఏర్పాటయ్యారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా జేఏసీకి మద్దతుగా నిలిచారు.
బీజేపీ క్లారిటీ ఏంటంటే
ఇక హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఒక్క బీజేపీ మాత్రమే క్లారిటీగా ఉంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇది వరకే తన అభిప్రాయమేంటో వెల్లడించారు. ఆయన ప్రకటన తరువాతే అయిదు జిల్లాల న్యాయవాదులు, బార్ అసోసియేషన్ల ప్రతినిధులు ఉద్యమించారు. విధుల బహిష్కరణను ఈ నెల 27 వరకు కొనసాగించాలని తీర్మానించారు.