పంచాయతీ ఎన్నికల నిర్వహణపై...ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ విషయమై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఏపీ సర్కారును ఆదేశించింది.
ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ జీఏడీ, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శులతోపాటు ఎన్నికల సంఘానికి ఈ మేరకు హై కోర్టు ధర్మాసనం నోటీసులిచ్చింది. దీనికి సంబంధించి ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్ పై హై కోర్టు స్పందించింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ లోకల్ గవర్నమెంట్స్ ఛాంబర్ సొసైటీ అధ్యక్షుడు, మరో అయిదుమంది హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ ఏడాది జూన్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో బీసీ జనాభా లెక్కల వివరాలు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి హై కోర్టు న్యాయమూర్తి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖల కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శులు, జనాభా లెక్కల రిజిష్ట్రార్ జనరల్లకు నోటీసులు జారీ చేశారు.
బీసీ జనాభా గణనపై పిటిషనర్ ఆరోపణలకు మీ వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించిన న్యాయమూర్తి విచారణను అప్పట్లో నాలుగు వారాలకు వాయిదా వేశారు. జస్టిస్ మంజునాథ్ కమిషన్ ఇచ్చిన నివేదికను వెల్లడించాలని, 2011 నాటి జనాభా వివరాల సేకరణ ప్రకారం బీసీ జనాభా లెక్కల్ని ప్రచురించాలంటూ ఏపీ బీసీ తరగతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.అలిమేన్రాజు, తెలంగాణ రాష్ట్ర బీసీ తరగతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె. శ్రీనివాస్ గౌడ్ కలిసి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.