కోడి పందాలపై అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు హైకోర్టు షాక్...నోటీసులు జారీ
కోడి పందాలపై తమ ఆదేశాలను ఖాతరు చేయని వారికి సంబంధించిన అన్నీ వివరాలు వెంటనే అందచేయాలంటూ హై కోర్టు జారీ చేసిన తాజా ఆదేశాలతో పలువురు అధికారపార్టీ నేతలకు గట్టి షాక్ తగిలింది. కోర్టు ఆదేశాలను లెక్కచేయని వారిని ఎవరిని వదిలిపెట్టబోయేది లేదని హై కోర్టు స్పష్టం చేసింది.
తమ ఆదేశాలను బేఖాతరు చేసి కోడి పందాల నిర్వహణకు తెగబడిన వారికి సంబంధించిన అన్ని వివరాలు వెంటనే తమకు అందచేయాలంటూ హై కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేయడంతో అధికార పార్టీ నేతలకు పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్లయింది. ఇదే విషయమై ఇప్పటికే కొందరు ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అలా నోటీసులు అందుకున్నవారిలో గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు దేవినేని మల్లికార్జునరావు, ముమ్మనేని వెంకట సుబ్బయ్యలు ఉన్నట్లు సమాచారం.
మొన్నసంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కోడి పందాలు యధేచ్చగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. పైగా చాలా చోట్ల టిడిపి ఎంపిలు, ఎంఎల్ఏలే దగ్గరుండి సవాళ్లు చేసి మరీ ఈ కోడి పందేలు నిర్వహించారు. వీటికి సంబంధించిన దృశ్యాలు మీడియాలో సైతం పదే పదే ప్రసారం అయ్యాయి. ఈ నేపధ్యంలో మంగళవారం ఈ కేసు విచారణకు రాగా ఆంధ్రప్రదేశ్లో కోడి పందేలను అడ్డుకోవాలని తాము ఆదేశించినా అధికారులు తమ ఆదేశాలను బేఖాతరు చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కోడిపందాల నిర్వహణకు సంబంధించి సాక్ష్యాలను పరిశీలించిన హై కోర్టు వెంటనే వారికి నోటీసులు అందచేయాలని ఆదేశించింది.
ఈ విధంగా కోడి పందాలను దగ్గరుండి నిర్వహించినవారి హోదాలు, చిరునామాలతో సహా పూర్తి వివరాలను తమ ముందుంచాలని కోర్టు స్పష్టం చేసింది. గుంటూరు జిల్లాలో ఈ విధంగా కోడి పందేలు నిర్వహించిన టిడిపి రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు దేవినేని మల్లికార్జునరావు, ముమ్మనేని వెంకట సుబ్బయ్యలకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న మరికొందరు టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సైతం నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరందరికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.