కారెం శివాజీ నియామకంపై...ఎపి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా కారెం శివాజీ నియామకంపై ఏపీ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కారెం శివాజీ నియామకాన్ని సవాలు చేస్తూ హై కోర్టులో పిటిషన్ దాఖలైన దరిమిలా న్యాయస్థానం శుక్రవారం ఈ నోటీసులు జారీ చేసింది.
గతంలోనే ఈ పదవిలో కారెం శివాజీ నియామకాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఆయన నియామకం చెల్లదని 2017 నవంబర్ 4 న హై కోర్టు తీర్పు చెప్పింది. అయితే అనంతర కాలంలో ఎపి ప్రభుత్వం శివాజీనా మరోసారి అదే పదవిలో నియమించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి తిరిగి నియామకం జరపడంపై హై కోర్టులో న్యాయవాది హరిప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు.
కారెం శివాజీ ఎంపిక, నియామకం చెల్లదంటూ గతంలో హైకోర్టు ఆదేశించిన విషయాలను పిటిషన్లో ప్రస్తావించిన న్యాయవాది హరిప్రసాద్, ఏపీ ప్రభుత్వం శివాజీని తిరిగి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా నియమించడం హైకోర్టు ఆదేశాలను ఉల్లఘించినట్లేనని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీకి లా డిగ్రీ లేదని, క్రిమినల్ కేసులు ఉన్నాయని, మాల మహానాడు అనే సంఘానికి అధ్యక్షుడిగా పని చేసిన కారణంగా అన్ని కులాలకి సమన్యాయం చేయలేడని కోర్టులో పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారని తెలిసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి హై కోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ...నియామకం ప్రక్రియ రికార్డులు సమర్పించాలని ఆదేశించింది. అలాగే ఈనెల 31న కారెం శివాజీ నేరుగా హైకోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
2017 లో ఇదే విషయమై దాఖలైన షిటిషన్ కు సంబంధించి...కారెం శివాజీ నియామకం చెల్లదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. కారెం శివాజీ నియామకాన్ని సవాలు చేస్తూ జె ప్రసాదబాబు, మరో నలుగురు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన అనంతరం జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు 4-11-2017న ఆ తీర్పును వెలువరించారు.