ఆర్టీసి సమ్మెపై హైకోర్టు భగ్గు: కార్మిక సంఘాలకు షోకాజ్ నోటీసులు
హైదరాబాద్: ఆర్టీసి కార్మికుల సమ్మెపై హైకోర్టు బుధవారంనాడు తీవ్రంగా మండిపడింది. కార్మికులు సమ్మెను కొనసాగించడం ద్వారా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఆగ్రహించింది. తక్షణం సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని ఆదేశిస్తూ, వాఇకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
సమ్మెను విరమించలేమని కార్మిక సంఘాలు న్యాయస్థానానికి చెప్పాయి. కోర్టు ఆదేశాలను ఎందుకు ధిక్కరిస్తున్నారంటూ హైకోర్టు మండిపడింది. కఇప్పటికే కార్మిక సంఘాలు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాయని అంటూ కోర్టు ధిక్కరణ కేసు ఎందుకు నమోదు చేయకూడదని ప్రశ్నించింది.
సమ్మె విరమించి, కోర్టుకు వస్తే 15 రోజుల గడువు ఇచ్చి, కార్మికులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పినా కార్మిక సంఘాలు పట్టించుకోలేదని హైకోర్టు మండిపడింది.
దీంతో గంట సమయం కావాలని కార్మిక సంఘాల నేతలు న్యాయస్థానాన్ని కోరగా అందుకు కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే సమయం మించిపోయిందని న్యాయస్థానం చెప్పింది.
ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలుగు రాష్ర్టాలకు న్యాయస్థానం ఆదేశించింది. పోలీసు భద్రతతో బస్సులు నడపాలని, కార్మికులు అడ్డుకుంటే అరెస్టులు చేయాలని కూడా థర్మాసనం ఆదేశించింది.
అవసరమైతే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా కోర్టు పేర్కొంది. కార్మికులపై ఎస్మా యాక్టు తీసుకోవచ్చునని తెలిపింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కార్మికులు సమ్మె విరమించలేదు కాబట్టే బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. వేసవి సెలవుల అనంతరం తదుపరి విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది.
కార్మిక సంఘాల నేతల ప్రతిస్పందన
హైకోర్టు తీర్పుపై కార్మిక సంఘాల నాయకులు మీడియా వద్ద ప్రతిస్పందించారు. 43 శాతం ఫిట్మెంట్పై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, కాబట్టి తమకు ఒక రోజు గడువు కావాలని విజ్ఞప్తి చేశామని అందుకు న్యాయస్థానం ఒప్పుకోలేదని వారు చెప్పారు.
కోర్టు ఇచ్చిన ఆదేశాలకు, ప్రభుత్వంతో మీకు ఉన్న ఒప్పందానికి మాకు సంబంధం లేదని కోర్టు తెలిపిందని వారన్నారు.
విజయవాడలో మౌన ప్రదర్శన
సమ్మెపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ విజయవాడ బస్టాండు ఆవరణలో ఆర్టీసీ కార్మికులు మౌన ప్రదర్శన జరిపారు. కృష్ణా జిల్లా జగ్గ్గయ్యపేట బస్టాండులోనూ కార్మికులు మౌన ప్రదర్శన జరిపారు.
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఆర్టీసీ కార్మికులు వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. వంటలతో కొండ తేనెటీగలు దాడి చేయడంతో నలుగురు కార్మికులు గాయపడ్డారు. నెల్లూరు నగరంలో ఆర్టీసీ బస్టాండు వద్ద సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు.