స్వామి పరిపూర్ణానందపై బహిష్కరణ ఎత్తివేసిన హైకోర్టు:కత్తి మహేష్ స్పందన ఇదీ!
హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామీజీపై విధించిన నగర బహిష్కరణను ఎత్తేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పును సినీ విమర్శకుడు కత్తి మహేష్ స్వాగతించారు.
అలాగే తనపై ఉన్న నగరబహిష్కరణ కేసు కూడా ఈ నెల 16న కోర్టు ముందుకు రాబోతోందని, తన విషయంలో కూడా ఇలాంటి సానుకూల నిర్ణయం రావచ్చని తాను ఆశిస్తున్నట్లు కత్తి మహేష్ ఈ సందర్భంగా చెప్పారు. పోలీసులు తనపై చట్ట పరంగా విధించిన సెక్షన్లు, వాళ్లు తీసుకున్న నిర్ణయం...ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని కత్తి మహేష్ పునరుద్ఘాటించారు. తనకు కోర్టు వారు న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నట్లు కత్తి మహేష్ తెలిపాడు. వివరాల్లోకి వెళితేస్వామి పరిపూర్ణానందకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నగర బహిష్కరణను ఎత్తివేస్తూ హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పరిపూర్ణానంద రెచ్చగొట్టే వాఖ్యలు చేశారంటూ హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధి నుంచి ఆయనను బహిష్కరిస్తూ ఆయా కమిషనర్లు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు మంగళవారం స్టే విధించింది.
మరోవైపు శ్రీరాముడిపై కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తొలుత ఆయనపై పోలీసులు నగర బహిష్కరణ విధించారు. అనంతరం ఇదే వివాదానికి సంబంధించి నెల రోజుల క్రితం పరిపూర్ణానంద స్వామీజీపై కూడా పోలీసులు బహిష్కరణ వేటు వేశారు. అయితే తనపై బహిష్కరణను ఎత్తివేయాలంటూ స్వామి పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పరిపూర్ణానంద వినతిని పరిశీలించిన హైకోర్టు ఆయనపై బహిష్కరణను ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
పరిపూర్ణానంద స్వామీజీపై నగర బహిష్కరణను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, భజరంగ్ దళ్, విశ్వహిందూపరిషత్, సంఘ్ పరివార్ శ్రేణులు సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహించడం గమనార్హం.