ఆ ముగ్గురి నోళ్లకూ తాళం: ఆయన హత్యపై నోరెత్తొద్దంటూ ఆదేశాలు: తదుపరి విచారణ పోలింగ్ తరువాతే!
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంపై గురువారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో ఓ రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెక్ పడినట్టే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వివేకానంద రెడ్డి హత్యోదంతంపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదని అంటూ హైకోర్టు ఆదేశించింది. తెలుగుదేశం సహా అన్ని రాజకీయ పార్టీలకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఎవ్వరూ, ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదని హైకోర్టు బెంచ్ పేర్కొంది. ఈ మేరకు ఓ అంగీకార పత్రాన్ని ఇవ్వాలని ప్రభుత్వం తరఫున వాదిస్తోన్న అడ్వకేట్ జనరల్, జగన్ తరఫున వాదిస్తోన్న న్యాయవాదిని సూచించింది. హైకోర్టు ఆదేశించిన వెంటనే- జగన్ తరఫు న్యాయవాదులు అంగీకార పత్రాన్ని బెంచ్ కు సమర్పించారు. మీడియాకు కూడా లీకులు ఇవ్వకూడదని పేర్కొంది. అనంతరం ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చేనెల 15వ తేదీకి వాయిదా వేసింది.
వైఎస్
వివేకా
హత్య
విచారణ
సాగేదెలా?
దర్యాప్తును
ప్రభావితం
చేసేలా
చంద్రబాబు,
జగన్
వ్యాఖ్యాలు
అంగీకార పత్రం ఎందుకు?
హైకోర్టుకు అంగీకార పత్రాన్ని అందజేస్తే.. ఎవ్వరైనా దాని ప్రకారం నడచుకోవాల్సి ఉంటుంది. హైకోర్టు పరిభాషలో దీన్ని అండర్ టేకింగ్ అని అంటారు. హైకోర్టు ఆదేశాలు, సూచనలను తాను తూ.చ. తప్పకుండా పాటిస్తానని సదరు వ్యక్తి ప్రమాణ పూరకంగా స్పష్టం చేయాలి. దీనికి అనుగుణంగా.. తదుపరి ఉత్తర్వులు గానీ, ఆదేశాలు గానీ వెలువడేంత వరకూ హైకోర్టు సూచించిన అంశంపై ఎక్కడ కూడా మాట్లాడకూడదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు. అలా చేస్తే.. కోర్టు ధిక్కారణ కిందికి వస్తుంది. ఆ తరువాత కోర్టు విధించే, ఎలాంటి శిక్షకైనా తల వంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
వారి నోళ్లకు తాళం పడినట్టే..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం ఇప్పటికే పూర్తిగా రాజకీయ రంగును పులుముకొన్న విషయం తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి, ప్రచార కార్యక్రమాలు పతాక స్థాయికి చేరుకుంటున్న దశలో వివేకా కడప జిల్లాలోని పులివెందులలో తన ఇంట్లో దారుణ హత్యకు గురి కావడం, పైగా ఆయన ప్రతిపక్ష పార్టీకి చెందిన సీనియర్ నేత కావడంతో వివాదాలు చుట్టుముట్టాయి. ప్రతిపక్ష పార్టీల నాయకుల వేళ్లన్నీ అధికార తెలుగుదేశం పార్టీ వైపు మళ్లాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బాధ్యుడిగా చేయడం మొదలు పెట్టారు. ఇదివరకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటన చోటు చేసుకోవడం, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు వివాదాస్పదంగా మార్చిన సందర్భాన్ని ఆధారంగా చేసుకున్నారు వైఎస్ఆర్ సీపీ నాయకులు. చంద్రబాబే ఈ హత్యకు బాధ్యత వహించాలంటూ ఆరోపించారు. ఈ హత్యకు ప్రభుత్వమే కారణమంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తన పినతండ్రి హత్యోదంతాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించారు.
వివేకా హత్యపై రాజకీయ విమర్శల్లో చంద్రబాబు ముందంజ
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని `కోడి కత్తి డ్రామా` అంటూ అభివర్ణించిన ఆయన.. అదే వ్యూహాన్ని వివేకా హత్యలోనూ అనుసరించారు. సొంత ఇంటి వారే హత్య చేసి ఉంటారని, అకారణంగా తమపై నిందలు మోపుతున్నారని అంటూ ఎదురుదాడి చేస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యను ప్రధాన అంశంగా మార్చుకున్నారు ముఖ్యమంత్రి. ప్రతి సభలోనూ ఆయన వివేకా హత్యను ప్రస్తావిస్తూ వచ్చారు. చివరికి- తన తండ్రి హత్యను రాజకీయం చేయొద్దంటూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత విలేకరుల సమావేశాన్ని పెట్టి మరీ చంద్రబాబును హెచ్చరించాల్సిన పరిస్థితి దాకా వెళ్లింది.
పవన్ కూడా తక్కువేమీ తినలేదు..
వైఎస్ వివేకా హత్య ఘటనను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి. జగన్ ను టార్గెట్ గా చేసుకున్న పవన్ కల్యాణ్ ఆయనపై ఘాటు విమర్శలు చేశారు. సొంత బాబాయ్ హత్యకు గురైతే.. పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి, ఇక రాష్ట్రాన్ని ఏమి కాపాడుతాడంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. పలు సందర్భాల్లో ఆయన ఈ హత్య ఘటనను ఎన్నికల ప్రచార వేదికలపై ప్రస్తావించారు. అదే సమయంలో- వివేకా హత్యపై ఎవ్వరూ, ఏ రకమైన వ్యాఖ్యలు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించడం చర్చనీయాంశమైంది.
ముందే హెచ్చరించిన `వన్ ఇండియా తెలుగు`
వివేకా హత్యోదంతంపై చంద్రబాబు నాయుడు గానీ, జగన్ గానీ, పవన్ కల్యాణ్ గానీ చేస్తోన్న వ్యాఖ్యానాల పట్ల సిట్ దర్యాప్తు దారీ తెన్నూ లేకుండా పోయే ప్రమాదం ఉందంటూ `వన్ ఇండియా తెలుగు` ఇదివరకే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురీ వ్యాఖ్యలు సిట్ దర్యాప్తు చేస్తోన్న కోణాన్ని పక్కకు మళ్లించే అవకాశం ఉందని అంటూ ఇదివరకే ఓ కథనాన్ని ప్రచురించింది. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే వివాదాస్పదంగా మాట్లాడటం, దీన్ని రాజకీయం చేయడం, కుటుంబ సభ్యులకే లింకులు పెట్టడం వంటి ఘటనల వల్ల సిట్ దర్యాప్తును ప్రభావితం చేస్తుందని వెల్లడించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ సౌభాగ్యమ్మ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సిట్ పేరుతో వైఎస్ కుటుంబ సభ్యులపై బురద జల్లేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఏపీ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.