స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు: నిమ్మగడ్డతో భేటీకి జగన్ సర్కార్కు డెడ్లైన్
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి డెడ్లైన్ విధించింది. మూడు రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో భేటీ కావాలని సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు, ఇతరత్రా అంశాలపై తాము ఆదేశించిన మేరకు ముఖ్య కార్యదర్శులతో కూడిన కమిటీ 72 గంటల్లోగా రమేష్ కుమార్తో సమావేశం కావాలని పేర్కొంది. ఈ మూడు రోజుల గడువు మంగళవారం నుంచే ఆరంభమౌతుందని స్పష్టం చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించలేమంటూ ఇదివరకే ప్రభుత్వం తన అశక్తతను హైకోర్టు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర కమిషన్ సర్వ సన్నద్ధంగా ఉందని తేల్చిచెప్పింది. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ముఖ్య కార్యదర్శులతో కూడిన కమిటీ.. నిమ్మగడ్డ రమేష్కుమార్తో భేటీ కావాలని సూచించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడినప్పటికీ.. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.
దీనితో హైకోర్టు మరోసారి ఈ విషయంలో జోక్యం చేసుకుంది. మంగళవారం మొదలుకుని మూడు రోజుల్లోగా రమేష్ కుమార్తో భేటీ కావాల్సి ఉంటుందని ఆదేశించింది. తనతో ముఖ్య కార్యదర్శులు భేటీ అయ్యారా? లేదా? అనే విషయాన్ని రమేష్ కుమార్ మళ్లీ.. హైకోర్టుకు తెలియజేస్తారని పేర్కొంది. దీనితోపై మరోసారి వాదనలు వింటామని తెలిపింది. ఈ నేపథ్యంలో.. ముఖ్య కార్యదర్శులతో కూడిన కమిటీని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాల్సి ఉండటంతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్తో సమావేశాన్ని సైతం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడింది.