జగన్ ప్రభుత్వానికి భారీ జలక్... సీబీఐకి సుధాకర్ వ్యవహారం.. హైకోర్టు ఆదేశాలతో ఉక్కిరి బిక్కిరి
ఏపీ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. రాజకీయంగా వివాదాస్పదంగా మారిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంపైన వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ను రోడ్డు పై గొడవ చేస్తున్నారంటూ అరెస్టు చేయడం కలకలం సృష్టించింది. సుధాకర్ మానసిక స్థితి బాగోలేదని ఆయన రోడ్డు పైన గొడవచేయడంతోనే అరెస్టు చేశామని స్థానిక పోలీసులు వివరణ ఇచ్చారు.
అయితే ఈ మొత్తం వ్యవహారంపై సుధాకర్ తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. ఈ రోజు సుధాకర్ అంశంపై విచారణ చేసిన హైకోర్టు ఆయనపై దాడి చేసిన పోలీసులపైన సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఆదేశించింది. ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు ప్రభుత్వంలో కలకలానికి కారణమయ్యాయి.
కోర్టులో సుధాకర్ బంధువులు పిటిషన్
కరోనావైరస్ ట్రీట్మెంట్ సమయంలో వైద్యసిబ్బందికి మాస్కులు లేవంటూ చేసిన వ్యాఖ్యలతో అనెస్థీషియా వైద్యుడు డాక్టర్ సుధాకర్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దానిపైన పెద్ద ఎత్తున రాజకీయంగా విమర్శలు తలెత్తాయి. అది కొనసాగుతుండగానే విశాఖలో జాతీయ రహదారిపై సుధాకర్ గొడవ చేస్తున్నారంటూ పోలీసులకు సమాచారం రావడంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పోలీసులతో పాటు సీఎంను కూడా దుర్భాషలాడారని పోలీసులు అధికారులు చెప్పుకొచ్చారు. ఆ సందర్భంలో జరిగిన పెనుగులాటలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ సుధాకర్ పై చేయి చేసుకున్నారు.
ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ను ప్రభుత్వం తర్వాత సస్పెండ్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సుధాకర్ బంధువులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన అఫిడవిట్ ఫైల్ చేసిన ప్రభుత్వం అందులో సుధాకర్ మానసిక పరిస్థితి బాగోలేదని కేజీహెచ్ వైద్యులు నిర్ధారించారని భావించింది. ఆ నివేదిక ఆధారంగా ఆయన్ను మానసిక వైద్యశాలకు తరలించారు.
ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు
ఇక ఈ అంశంపైన రాజకీయంగా దుమారం చెలరేగింది. ఒక దళిత వైద్యుడిని ప్రభుత్వం వేధిస్తోందంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. సుధాకర్ ఎపిసోడ్ పైన ఈ రోజు హైకోర్టులో కీలక విచారణ జరిగింది. అంతకుముందు విశాఖ సెషన్స్ జడ్జి నేరుగా సుధాకర్ వాంగ్మూలం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. వాంగ్మూలం తీసుకుని ఆ నివేదికను సెషన్స్ జడ్జి హైకోర్టుకు సమర్పించారు. ఆ సమయంలో సుధాకర్ వంటిపైన గాయాలు ఉన్నట్లు తెలిసిందని ప్రభుత్వం సమర్పించిన నివేదికలో మాత్రం ఆ విషయం ప్రస్తావించలేదని న్యాయస్థానం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
Recommended Video
8వారాల్లోగా నివేదిక ఇవ్వాలంటూ సీబీఐకి ఆదేశాలు
దీంతో ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని నమ్మలేక పోతున్నామని వ్యాఖ్యానించినట్లు సుధాకర్ తరపున న్యాయవాదులు చెబుతున్నారు. సుధాకర్ పై దాడిచేసిన పోలీసులపై సీబీఐ కేసును నమోదు చేసి విచారణ చేపట్టాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడిందా ఏ రకంగా ముందుకెళుతుందనేది ఆసక్తి కరంగా మారనుంది. ఇదే సమయంలో కోర్టు నిర్ణయాన్ని ప్రతిపక్షాలు స్వాగతిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది.