ఏపీఎన్జీవోల భూములపై టి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: గోపన్పల్లిలోని ఏపీఎన్జీవో భూముల విషయంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏపీఎన్జీవోల భూములలో యథాతథ స్థితిని కొనసాగించాలని హైదరాబాద్ హైకోర్టు సోమవారం ఆదేశించింది. నాలుగు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ఏపీఎన్జీవో సంఘానికి కేటాయించిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. నోటీసులిచ్చినా సొసైటీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆగమేఘాలపై చర్యలు చేపట్టింది. గురువారం స్వాధీనం చేసుకుని సర్కారు స్థలమంటూ బోర్డులు పాతింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లిలోని సర్వేనంబరు 36, 37లోని 189.11 ఎకరాల భూమిని ప్రభుత్వం 2005లో ఏపీఎన్జీవోల హౌసింగ్ సొసైటీకి కేటాయించింది. ఈ భూముల్లో ఇప్పటి వరకు నిర్మాణాలు చేపట్టకపోవడంతో పాటు, సొసైటీ సభ్యులెవరో కూడా ఇంత వరకు తేల్చకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
ఈ భూములను వెనక్కి తీసుకునే విషయమై బుధవారం రాత్రి రెవెన్యూ ముఖ్య అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయంకల్లా ఫైలుపై సంతకం చేసిన రెవెన్యూమంత్రి మహమూద్ అలీ, సీఎం కేసీఆర్కు పంపించారు. ఆ వెంటనే సీఎం కూడా ఆమోదించారు.
మెమో జారీ
హైదరాబాదులోని గోపన్పల్లిలో ఏపీఏన్జీవోలకు కేటాయించిన 189 ఎకరాల 14 గుంటల భూములను స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది.