నిమ్మగడ్డకు హైకోర్టు షాక్- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై- కీలకంగా మారిన ఫామ్ 10
ఏపీలో గతేడాది ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన ఎన్నికల విషయంలో హైకోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మధ్యంతర ఉత్తర్వులే అయినా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ఇవే ఇప్పుడు కీలకంగా మారాయి. ఫామ్ 10 జారీ చేసిన ఏకగ్రీవాల విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోకుండా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు పరిషత్ ఎన్నికల షెడ్యూల్ జారీపైనా ప్రభావం చూపేలా ఉన్నాయి. అయితే ఈ నెల 23 వరకూ మాత్రమే హైకోర్టు ఆదేశాలు అమల్లో ఉండనున్నాయి.
ఏపీలో పరిషత్ ఎన్నికల సంగ్రామం
ఏపీలో గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తిరిగి ప్రారంభించేందుకు ఎన్నికల సంఘం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో అప్పట్లో ఏకగ్రీవాలైన సీట్ల విషయంలో విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఫిర్యాదులు స్వీకరించి వాటిని సమీక్షించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఏకగ్రీవాలపై నిమ్మగడ్డకు హైకోర్టు షాక్
గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన సీట్ల విషయంలో సమీక్షకు సిద్ధమవుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ను అడ్డుకునేందుకు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. అప్పట్లో ఏకగ్రీవాలైన చోట వాటిని ఆమోదిస్తూ ఎన్నికల సంఘం డిక్లరేషన్ ఇచ్చిన చోట్ల ఇప్పుడు జోక్యం చేసుకోవద్దని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23 వరకూ తమ మధ్యంతర ఆదేశాలు అమల్లో ఉంటాయని ప్రకటించింది.
ఏకగ్రీవాలకు కీలకంగా మారిన ఫామ్ 10
గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరు సందర్భంగా ఏకగ్రీవమైన సీట్ల విషయంలో ఎన్నికల కమిషన్ జారీ చేసే ఫామ్ 10 కీలకంగా మారింది. ఓసారి ఏకగ్రీవాన్ని గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఫామ్ 10పై కోర్టులు కూడా జోక్యం చేసుకోవడం కుదరదని నిబంధనలు చెప్తున్నాయి. దీంతో ఫామ్ 10 జారీ చేసిన సీట్లలో మాత్రం జోక్యం చేసుకోవద్దని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటివరకూ ఫామ్ 10 ఇవ్వని చోట మాత్రం జోక్యం చేసుకుని సమీక్షించవచ్చని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.
పరిషత్ ఎన్నికల షెడ్యూల్ జారీకి అడ్డంకి
హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు ఈ నెల 23 వరకూ అమల్లో ఉంటాయి. అంటే నాలుగు రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత వాటిపై ఎలాగో హైకోర్టు తుది తీర్పు ఇస్తుంది. అయితే ఈ నెల 20లోపు బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ల ఉపసంహరణలపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలు ఇచ్చారు. కానీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే ఫామ్ 10 జారీ చేసిన చోట సమీక్ష సాధ్యం కాదు. కాబట్టి ఎస్ఈసీ నిమ్మగడ్డ హైకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తారా లేక వెంటనే పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ జారీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.