అమరావతి: చంద్రబాబుకు హైకోర్టులో షాక్, జగన్కు గ్రామస్తుల థ్యాంక్స్, ఆళ్ల ఆగ్రహం
భూసేకరణపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హైకోర్టులో సోమవారం నాడు చుక్కెదురైంది. గుంటూరు - పెనుమాకలలో భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. రైతుల అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానం
విజయవాడ/హైదరాబాద్: భూసేకరణపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హైకోర్టులో సోమవారం నాడు చుక్కెదురైంది. గుంటూరు - పెనుమాకలలో భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. రైతుల అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానం హితవు పలికింది.
రాజధాని గ్రామాల్లో రైతుల నుంచి భూములు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. పెనుమాకలో భూసేకరణపై ప్రభుత్వం ఈ నెల 11న నోటిఫికేషన్ జారీ చేసింది.
భార్యలు చూస్తే..: 'పొలిటికల్ పంచ్'పై బాబు, ఇదీ మా పరిస్థితి అని మోడీతో
దీనిపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. అన్నదాతల అభ్యంతరాలను పరిష్కరించాకే ముందుకెళ్లాలని, అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్
రాజధాని పరిధిలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన 660.83 ఎకరాలకు ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది.
దీంతో 904 మంది భూయజమానులు ప్రభావితులవుతారని ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. భూములు ఇచ్చేందుకు ఇష్టపడని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురయింది.
హైకోర్టు తీర్పుపై రైతులు
హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలను పెనుమాక రైతులు స్వాగతించారు. ప్రభుత్వం తమను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ తరపున పోరాడుతున్నందుకు వైసిపి అధినేత జగన్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ తీర్మానాలు చేసినా పట్టించుకోకుండా భూములు లాక్కునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. రాజధాని రైతులకు అండగా ఉంటామన్నారు.
చిన్న రైతులను ఇబ్బంది పెట్టవద్దు
చిన్న చిన్న రైతులను భూమి కోసం ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ఈ ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృథా చేస్తోందన్నారు. ల్యాండ్ పూలింగ్ పైన కోర్టు స్టే విధించడం సంతోషకరమన్నారు.
అక్రమాల కోసమే
అక్రమాల కోసమే చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించాలని భావిస్తున్నారని ఆళ్ల ఆరోపించారు. పోలీసులతో రైతులను భయభ్రాంతులకు గురి చేసి లాక్కుందామని చూస్తున్నారన్నారు.
ఇప్పటి వరకు తీసుకున్న భూమిలోనే ఒక్క శాతం వినియోగంలోకి రాలేదన్నారు. గ్రామస్తులను బెదిరించి గ్రామ సభలు నిర్వహించారని మండిపడ్డారు.