ఇష్టారీతిన భూముల లీజు, ఆ పాపం గత ప్రభుత్వానిదే: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విపక్షాలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైరయ్యారు. ఏపీలో దేవదాయశాఖ భూములు అన్యాక్రాంతమవుతోన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దానినే ఎల్లో మీడియో ప్రమోట్ చేస్తుందని.. ఆయా సంస్థలపై కూడా చర్యలు తీసుకుంటామని దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి స్పష్టంచేశారు. దేవదాయ భూములే కాక.. ఇళ్లస్థలాలు కూడా తీసుకుంటున్నారనే ఆరోపణలను తోసిపుచ్చారు.
నిబంధనలకు పాతర..
హతీరాం మఠం భూముల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఇదివరకే సీఐడీ, లోకాయుక్త నివేదిక ఇచ్చిందని మంత్రి గుర్తుచేశారు. ట్రస్ట్ భూములను మఠాధిపతులు ఇష్టారీతిన లీజుకు ఇవ్వడం సరికాదన్నారు. దేవదాయశాఖను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన భూములు దేవదాయశాఖ అనుమతితోనే లీజుల ప్రక్రియ జరగాలన్నారు. కానీ నిబంధనలకు పాతర వేస్తున్నారని పేర్కొన్నారు.
1418 ఎకరాల భూమి
హతీరాం మఠానికి ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటకలో 1418 ఎకరాల భూములు ఉన్నాయని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. బెంగళూరులో 4713 చదరపు మీటర్ల భూమి లీజుకు సంబంధించి దేవదాయశాఖను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని అక్కడి హతీరాం మఠానికి బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆదేశించిందని మంత్రి తెలిపారు. మఠం భూములను మఠాధిపతులే ధారాదత్తం చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం కూడా భూములును తమ అనుయాయులకు అప్పగించి.. ఇప్పుడు నీతిసూక్తులు వల్లిస్తుందని చెప్పారు.
గజం భూమి..
ఎల్లో మీడియా రాసిన కథనాలను ఆధారంగా తీసుకొని విపక్షాలు బురదజల్లుతున్నారని మండిపడ్డారు. అక్రమ లీజులు ఇచ్చింది గత ప్రభుత్వంలోనని గుర్తుచేశారు. దేవదాయశాఖకు సంబంధించి గజం స్థలం విక్రయించాలన్న హైకోర్టు అనుమతి కావాలి.. ఆ విషయం విపక్ష నేతలకు తెలియదా.. అని మంత్రి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని మాత్రం గుర్తించరని.. ఇదివరకు చేసిన ప్రభుత్వాల తప్పిదాలను తమపై బురదజల్లడం సరికాదన్నారు. దీనికి కొత్తగా ఇళ్ల స్థలాలను కూడా తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు.