కారెం శివాజీకి హైకోర్టులో చుక్కెదురు: అప్పీల్ పిటిషన్ కొట్టివేత
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్గా కారెం శివాజీ నియామకం చెల్లదని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది.
హైదరాబాద్: కారెం శివాజీకి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్గా కారెం శివాజీ నియామకం చెల్లదని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. నియామకాన్ని కొట్టివేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం, కారెం శివాజీ దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ నియామక ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగలేదని పిటిషనర్లు వాదన వినిపించారు. శివాజీ న్యాయ విద్య చదవలేదని.. కమిషన్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించే అర్హత ఆయనకు లేదని హైకోర్టుకు తెలిపారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న సింగిల్ జడ్జి కారెం శివాజీ నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
సింగిల్ జడ్జి ఉత్తర్వులపై దాఖలైన అప్పీళ్లను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎ శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది.