సిఆర్డిఎపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సీఆర్డీఏపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాతే విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే సీఆర్డీఏ బిల్లు చట్ట వ్యతిరేకం అంటూ హైకోర్టు మాజీ న్యాయమూర్తితో పాటు ఒక పత్రికా ప్రతినిధి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనికి సంబంధించి గతంలో రెండు సార్లు విచారణకు వచ్చినప్పటికీ హైకోర్టు వాయిదా వేస్తూ వచ్చింది. సీఆర్డీఏపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు వాదించారు. అయితే సీఆర్డీఏపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు వేసవి సెలవుల తర్వాతే విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది.
శేషాచలం ఎన్కౌంటర్పై విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన శేషాచలం ఎన్కౌంటర్పై కేసు విచారణ బుధవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్కౌంటర్లో మృతిచెందిన ఆరుగురు స్మగ్లర్ల ఫస్ట్ పోస్టుమార్టం రిపోర్టును ఏపీ ప్రభుత్వం కోర్టుకు అందజేసింది. బుధవారం విచారణ సమాయానికి రీ-పోస్టుమార్టం రిపోర్టును అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.
జిహెచ్ఎంసీ ఎన్నికలపై విచారణ వాయిదా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్పై విచారణను హైకోర్టు మంగళవారం నాటికి వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని న్యాయస్థానం గతంలో తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించిన విషయం తెలిసిందే. వార్డుల విభజన పూర్తి చేసే వరకు గడువు కావాలని ప్రభుత్వం కోరింది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది.