చర్యలు తీసుకుంటారా? తీసుకోమంటారా?: డీజీపీపై హైకోర్టు ఆగ్రహం, గవర్నర్కు దాడులపై బాబు ఫిర్యాదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు ఘటనతోపాటు అమరావతి గ్రామాల్లో పోలీసుల కవాతు, ఆంక్షలపై ప్రశ్నించింది.
చర్యలు మీరు తీసుకుంటారా? మేం తీసుకోవాలా?
సీఆర్పీసీ 151 సెక్షన్ ఆర్డర్ చదవాలన్న ప్రధాన న్యాయమూర్తి.. విశాఖ పోలీసు అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అయితే, కోర్టు ఆదేశాలిస్తే చర్యలు సదరు పోలీసులపై చర్యలు తీసుకుంటామని.. కేసు కోర్టులో పెండింగ్లో ఉండటం వల్లే చర్యలు తీసుకోలేదని డీజీపీ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే.. తామే తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి తేల్చి చెప్పారు.
చట్టాన్ని అతిక్రమిస్తే సమర్థిస్తారా?
కిందిస్థాయి అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తే.. దాన్ని సమర్థిస్తారా? అంటూ ప్రశ్నించింంది న్యాయస్థానం. అలాగే విశాఖలో అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాగా, ఈ కేసు విచారణ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆరు గంటలపాటు న్యాయస్థానంలో వేచిచూశారు.
దాడులపై గవర్నర్కు టీడీపీ ఫిర్యాదు
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీసీ దాడులపై గవర్నర్ హరిచందన్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నపై హత్యాయత్నం చేశారని, అనేక జిల్లాల్లో ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు.
Recommended Video
వైసీపీ అరాచకాలంటూ చంద్రబాబు
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఎవరైనా మాట్లాడితే ఆర్థికంగా, భౌతికంగా దాడులు చేసి దెబ్బతీస్తున్నారని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. మీడియా ప్రతినిధులపైనా ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని.. వైసీపీ అరాచకాలపై గవర్నర్ స్పందించాలని చంద్రబాబు కోరారు. ఉన్మాదంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని జగన్ సర్కారుపై ధ్వజమెత్తారు. మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై వైసీపీ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. పలు జిల్లాల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు.