కోడి పందాలపై...హైకోర్టు సీరియస్కు ఆ ఫొటోనే కారణమా?...
అమరావతి: కోడిపందేల విషయంలోఎపి ప్రభుత్వంపై హైకోర్టు అంత సీరియస్ అవడానికి కారణం ఒక ఫోటో నే కారణమని అధికారపార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఒక ఎమ్మెల్యే బహిరంగంగా తన చేతిలో కత్తి కట్టిన కోడిని పట్టుకొని హైకోర్టు ఉత్తర్వులు మాకు వర్తించవు అని ప్రకటించడం, ఆ దృశ్యాలు మీడియాలో రావడమే హైకోర్టు అంత ఫైరవడానికి కారణం అంటున్నారు.
ఎపిలో కోడిపందాలు జోరుగా సాగడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్కుమార్, డీజీపీ మాలకొండయ్యలు స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడానికి కారణమేంటి?...డీజీపీ మాలకొండయ్యకు కీలక సమావేశం ఉండడంతో వ్యక్తిగత హాజరునుంచి మినహాయించిన హైకోర్టు...సీఎస్ మాత్రం ఈనెల 29న కోర్టుకు రావాల్సిందే అని స్పష్టం చేసింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఇలా ప్రభుత్వ ఉన్నతాధికారులనే నేరుగా బాధ్యులను చేయడం వెనక ఏం జరిగిందన్న దానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అయితే హైకోర్టు ఇంతలా సీరియస్ అవడానికి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కోడిపందేల విషయంలో బహిరంగంగా చేసిన ఒక ప్రకటన హైకోర్టు ఆగ్రహానికి కారణమైందని అంటున్నారు. ఆ ఎమ్మెల్యే కత్తి కట్టిన పందెం కోడిని చంకలో పెట్టుకుని మరీ...'హైకోర్టు ఉత్తర్వులు మాకు వర్తించవు' అంటూ వ్యాఖ్యలు చెయ్యగా, ఆ వ్యాఖ్యలను మీడియా యథాతథంగా ప్రచురించింది. అలా పబ్లిగ్గా కోడిపందేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా మాట్లాడడం, బహిరంగంగానే కత్తికట్టిన కోడిని పట్టుకుని ఫొటో దిగడం...హైకోర్టు దృష్టికి వెళ్లడంతో చాలా సీరియస్గా ఉందని సమాచారం. ఆ ప్రభావమే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత యంత్రాంగంపై పడినట్లుగా తెలుస్తోంది.
ముఖ్యంగా కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన కోడి పందాల బరి రాష్ట్రంలోనే సరికొత్త రికార్ఢు సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో కోడిపందాలను భారీ స్థాయిలో నిర్వహించారు. ఇక్కడి ప్రధాన బరిని స్థానిక టిడిపి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పూజలు చేసి మరీ ప్రారంభించడం విశేషం. పైగా ఈ గ్రామం రాష్ట్ర ఇంటిలిజెన్స్ డిజి ఏబి వెంకటేశ్వరరావు స్వగ్రామం కావడం మరో విశేషం. అలాగే ఇక్కడ కోడిపందాల బరులు నిర్వహించరాదని విజయవాడ జాయింట్ కమిషనర్ వెళ్లి స్వయంగా చెప్పినా కానీ నిర్వాహకులు ఏమాత్రం లెక్కచెయ్యకపోవడం గమనార్హం...