ఎపి ప్రభుత్వానికి,కార్పొరేట్ కాలేజీలకు హైకోర్టు నోటీసులు...విద్యార్థుల ఆత్మహత్యలపై సీరియస్
తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ విషయమై ఎపి, తెలంగాణా ప్రభుత్వాలకు, ఇంటర్మీడియట్ బోర్డ్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసి 15 రోజుల్లో సమాధానాలు ఇవ్వాల్సిందని ఆదేశించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న నారాయణ, శ్రీ ఛైతన్య విద్యాసంస్దల్లో విద్యార్ధుల ఆత్మహత్యల ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు కళాశాలల్లో గడచిన మూడున్నర ఏళ్ళల్లో సుమారు 70 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని ఉంటారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంతమంది పిల్లలు మరణిస్తున్నాఎపి ప్రభుత్వం ఈ విషయాన్నిఅసలు సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించలేదు. దీంతో లోక్ సత్తా నేత ఒకరు హై కోర్టును ఆశ్రయించడంతో విద్యార్థుల బలవన్మరణాలను కోర్టు తీవ్రంగా పరిగణించి నోటీసులు జారీ చేసింది.
పిట్టల్లా రాలిపోతున్నా...పట్టించుకోలేదు...
గడచిన మూడున్నరేళ్ళుగా కార్పొరేట్ విద్యాసంస్ధల్లో చదువుల విషయం గాని, మరే విషయమైనా తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా నారాయణ, శ్రీ చైతన్య సంస్ధల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీడియా, విద్యార్ధి సంఘాలు ఎంత గోల పెట్టినా అవేవీ చంద్రబాబు దృష్టిలో పడలేదు. పడలేదనేకంటే పట్టించుకోలేదనే చెప్పుకోవచ్చు.
కారణం ఏంటంటే...సన్నిహితులు కావడమే...
ఆ రెండు కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు నారాయణ, చైతన్య రాజు ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు బాగా సన్నిహితులు కావటమే ఆయన విద్యార్థుల ఆత్మహత్యలను పట్టించుకోకపోవడానికి కారణమని చెప్పుకోవచ్చు. నారాయణ విద్యాసంస్థల నారాయణ అయితే చంద్రబాబుకు ఆప్తులు, మున్సిపల్ శాఖ మంత్రి, మరో మంత్రి గంటా శ్రీనివాసరావుకు వియ్యంకుడు. ఇక చైతన్య రాజుకు సిఎంతో సాన్నిహిత్యం ఉంది. అందుకే ఈ రెండు కళాశాలల మీద ఎన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అందరూ అనుకుంటున్నారు.
సిఎం జోక్యం చేసుకున్నా...చర్యలు మాత్రం లేవు...
ఆమధ్యకాలంలో వరుసగా ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవటంతో రెండు రాష్ట్రాల్లోని విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన మొదలుపెట్టాయి. దాంతో సిఎం చంద్రబాబునాయుడు స్వయంగా రంగంలోకి దిగి అసలు కార్పొరేట్ కళాశాలల్లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు కార్పొరేట్ విద్యాసంస్ధల యాజమాన్యాలు, విద్యా సంస్ధల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కానీ ఆ సమావేశం అయితే జరిగింది గాని..ఆ తరువాత...ఎవరిపైనా ఎటువంటి చర్యలు లేవు.
లోక్ సత్తా...కోర్టుకు లేఖ
ఇలా పెద్ద సంఖ్యలో విద్యార్థుల బలవన్మరణాలపై ఆందోళన చెందిన ప్రకాశం జిల్లాకు చెందిన లోక్ సత్తా ఆందోళ సమితి కో-కన్వీనర్ దాసరి ఇమ్మాన్యుయేల్ హై కోర్టుకు ఓ లేఖ రాశారు. దీంతో విద్యార్ధుల వరుస ఆత్మహత్యలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తనకు అందిన లేఖనే ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా కోర్టు పరిగణిస్తూ విచారణ చేపట్టింది. అందులో భాగంగా విద్యాసంస్ధల యాజమాన్యాలకు, ఇంటర్మీడియట్ బోర్డులకు, రెండు ప్రభుత్వాలకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.