కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు సీరియస్.. ఇదంతా టీడీపీ కుట్ర అంటున్న వైసీపీ
ఏపీలో రాజధాని అమరావతిని కొనసాగించాలని రాజధాని ప్రాంత వాసులు, అలాగే ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. ఇక మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుని పలు కార్యాలయాల తరలింపుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో శాసనమండలిలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందకున్నా సీఎం జగన్ రాజధాని కార్యాలయాల తరలింపు నిర్ణయం తీసుకోవటంపై కోర్టును ఆశ్రయించారు రాజధాని ప్రాంత రైతులు . ఇక నేడు ఈ పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఏపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
విచారణ పెండింగ్లో ఉండగా ఆఫీసులను ఎందుకు తరలించారని హైకోర్టు ఆగ్రహం
విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్లపై విచారణ పెండింగ్లో ఉండగా ఆఫీసులను ఎందుకు తరలించారని ధర్మాసనం ప్రశ్నించింది. వెంటనే వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ నిన్న వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు పై విధంగా స్పందించింది. ఇక అంశంపై మరో రెండు లంచ్మోషన్ పిటిషన్లు వేశారు. మొత్తం మూడు పిటిషన్లను ప్రస్తుతం ధర్మాసనం విచారిస్తుంది.
Recommended Video
జీవో నెం.13 చట్ట విరుద్ధమని రైతుల తరపున పిటీషన్
విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూలు తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. రైతుల తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. ఇకే ఈ పిటీషన్ లో జీవో నెం.13 చట్ట విరుద్ధమని రైతులు పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ చైర్మన్, సీఆర్డీఏను ప్రతివాదులుగా చేర్చి పిటిషనర్ పిటీషన్ వేశారు . ఈ పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ కొనసాగుతుంది.
రైతులతో కోర్టులో కేసులు వేయిస్తుంది టీడీపీనే అని ఫైర్ అవుతున్న వైసీపీ
ఇక ఇదంతా టీడీపీ కుట్ర అని వైసీపీ ఆరోపిస్తుంది. కర్నూలుకు విజిలెన్స్ కమిషనరేట్ రాకుండా టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని, దానిలో భాగంగానే రైతులతో హైకోర్టులో కేసులు వేయిస్తున్నారని వైసీపీ నేత ఎస్వీ మోహన్రెడ్డి ఆరోపణలు గుప్పించారు . కర్నూలు న్యాయరాజధాని కాదని టీడీపీ నేతలు చెప్పడం సిగ్గుచేటంటూ ఆయన మండిపడ్డారు. కావాలనే రాయలసీమలో అభివృద్ధిని టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.