హాజరు కావాల్సిందే..!..ఎపి స్పీకర్ కోడెలకు హైకోర్టు షాక్
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు విచారణ కోసం ఈ నెల 10న ధర్మాసనం ముందు హాజరు కావాలంటూ స్పీకర్ కోడెలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
స్పీకర్ కోడెల గతంలో ఒక టివి ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ 2014 ఎన్నికల్లో తాను రూ.11 కోట్ల 50లక్షలు ఖర్చుపెట్టానని చెప్పారంటూ సింగిరెడ్డి భాస్కర్రెడ్డి అనే వ్యక్తి కరీంనగర్ కోర్టులో పిటిషన్ వేశారు. స్పీకర్ కోడెల ఎన్నికల నియమావళిని అతిక్రమించారంటూ...అందుకు తగిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించిన పిటిషనర్ ఐటీ అధికారులతో ఈ విషయమై విచారణ జరిపించాలని కోరారు.
ఎన్నికల నిబంధన 171 ఈ, ఎఫ్, జీ, ఐ ఆఫ్ 200 ఐపీసీ కింద కోడెలను విచారించి...అంత పెద్ద మొత్తంలో ఖర్చు ఎందుకు పెట్టారు? ఆ సొమ్ము ఎక్కడినుండి వచ్చింది? ఎవరి పెట్టారో విచారణ జరపాలని కోర్టును కోరారు పిటిషనర్. దీంతో ఈ కేసులో స్పీకర్ కోడెల అప్పట్లో తాను కూడా హైకోర్టును ఆశ్రయించి స్టే పొందగా...అది గత నెల 27తో ముగిసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10 న జరిగే విచారణకు స్పీకర్ కోడెల స్వయంగా హాజరు కావాల్సిందేనని హై కోర్టు ఆదేశించింది.
ఒక టివి ఛానెల్ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నికల్లో పెరుగుతున్న వ్యయం గురించి స్పీకర్ కోడెల వివరిస్తూ తాను రాజకీయ ప్రవేశం చేసిన మొదట్లో, అంటే 1983లో జరిగిన ఎన్నికల్లో రూ.30వేలు ఖర్చు చేశానని...ఆ రూ.30వేలు కూడా గ్రామాల్లోని ప్రజల నుంచి చందాల రూపంలో వచ్చాయని చెప్పారు. అప్పటినుంచి ప్రతీ ఎన్నికలకూ ఖర్చు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తనకు రూ. 11 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు అయిందని మీడియా ముఖంగా బహిర్గతంగా వెల్లడించారు కోడెల శివప్రసాద్ రావు.
దీంతో ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో పాటు అప్పుడు ఆయన చేసిన ఆ వ్యాఖ్యలే తరువాత తలనొప్పి గా పరిణమించాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్ ఎన్నికల నిబంధనలను అతిక్రమించారంటూ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. స్పీకర్ కోడెలను అనర్హుడిగా ప్రకటించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలో కోడెల హై కోర్టు నుంచి స్టే పొందడం, తాజాగా హై కోర్టు ఆదేశం పరిణామాలు చోటుచేసుకున్నాయి.