బొండా ఉమాకు హై కోర్టు షాక్ .. ఆ పిటీషన్ విచారణార్హం కాదని కొట్టేసిన కోర్టు
టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు కి హైకోర్టు షాక్ ఇచ్చింది . విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ ఫలితంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బొండా ఉమా వేసిన రిట్ పిటీషన్ విచారణార్హం కాదని కోర్టు కొట్టి పారేసింది. దీంతో ఆయన ఖంగు తిన్నారు .
కౌలు రైతులకు పంట రుణాలు కష్టమేనా .. జగన్ సర్కార్ నిర్ణయానికి బ్యాంకర్లు ఏమంటున్నారు ?
Recommended Video
బోండా ఉమా రిట్ పిటిషన్కు విచారణార్హత లేదని పేర్కొన్న హై కోర్టు ధర్మాసనం
విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగాడు టీడీపీ అభ్యర్థి బోండా ఉమా. ఇక ప్రత్యర్ధి మల్లాది విష్ణుతో హోరా హోరీగా పోరాడినా ఆయన 25 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సక్రమంగా జరగలేదని ఆరోపిస్తూ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై కేంద్ర ఎన్నికల కమిషన్ తన వాదనలు వినిపించింది. టీడీపీ అభ్యర్థి దాఖలు చేసిన రిట్ పిటిషన్కు విచారణార్హత లేదని ఈసీ వాదించింది. ఈ కేసులో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం రిట్ పిటిషన్కు విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ ఈ వ్యాజ్యాన్ని శుక్రవారంనాడు కొట్టేసింది.
మల్లాది విష్ణు గెలిచినట్టు ఇచ్చిన ఉత్తర్వుల రద్దు కోసం బోండా ఉమా రిట్
ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుండి ఎన్నికల బరిలోకి దిగిన బొండా ఉమా కేవలం 25ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓటమిపాలయ్యారు. దీనిపై టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్లను లెక్కించిన తర్వాతే ఫలితాల్ని ప్రకటించాలని కోరినా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ఆయన తనపై 25 ఓట్లతో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు గెలుపొందినట్లు అధికారులు మే 23న జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన అందులో కోరారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు వ్యత్యాసాల్ని గమనించానని బోండా న్యాయస్థానానికి విన్నవించారు.
ఓట్ల లెక్కింపుపై అభ్యంతరం ఉంటె ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చెయ్యాలని సూచించిన కోర్టు
అయితే హై కోర్టు ధర్మాసనం ఓట్ల లెక్కింపుపై ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల కమీషన్ కు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిల ధర్మాసనం ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. కానీ ఆయన కోరినట్టు ఎన్నిక రద్దు సాధ్యం కాదని పేర్కొంది. దీంతో బోండా ఉమకు కోర్టులో చుక్కెదురు అయ్యింది.