ఎస్సీ ఎస్టీ చైర్మన్: బాబుకు హైకోర్టులో ఝలక్, జగన్పై కారెం శివాజీ ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో మంగళవారం నాడు షాక్ తగలింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా కారెం శివాజీని నియమించడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కారెం శివాజీకి కూడా నోటీసులు జారీ చేసింది.
ప్రభుత్వం ఇటీవలె కారెం శివాజీని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా నియమించింది. అతను మంగళవారం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.
అయితే, కారెం శివాజీకి చైర్మన్ పదవి ఇవ్వడంపై ప్రసాద్ బాబు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. శివాజీ నియామకానికి అనుసరించిన విధానంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రభుత్వానికి, శివాజీకి నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 7వ తేదీకి వాయిదా వేసింది.
నాపై ఎలాంటి కేసులు లేవు: కారెం శివాజీ
తమ సామాజిక వర్గాన్ని దెబ్బతీసేందుకు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు ఈ కేసులు వేశారని కారెం శివాజీ అన్నారు. తన పైన క్రిమినల్ కేసులు ఉన్నాయని చెబుతున్నారని, కానీ అలాంటివి ఏవీ లేవన్నారు.
జగన్ ఇలాంటి కుట్రలు చేస్తే తిప్పి కొడతామని చెప్పారు. తన పైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఫిర్యాదు చేశారని, కానీ లేవని చెప్పారు. తన పైన కేసులు లేవని, తాను ప్రమాణ స్వీకారం చేస్తానని, హైకోర్టు ప్రమాణ స్వీకారం ఆపాలని చెప్పలేదన్నారు. పూర్తి వివరాలు సమర్పించాలని నోటీసులు ఇచ్చిందన్నారు.