అక్రమ మైనింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడిన హై కోర్టు...తీవ్ర హెచ్చరికలు
హైదరాబాద్:సున్నపురాయి అక్రమ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏ విషయమైనా కోర్టు ఆదేశిస్తేనే గాని స్పందించరా?...అని హై కోర్టు ప్రశ్నించింది. గనుల అక్రమ తవ్వకాలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తామని కోర్టు చెబితే...మీరు సీఐడీతో ఎలా విచారణ చేయిస్తారు?...అని న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరులు అక్రమంగా వెలికి తీసిన సున్నపురాయి వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.31.39 కోట్ల నష్టం వచ్చిందని, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు స్పందించడం లేదంటూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ పిల్ పై మరోసారి విచారణ జరిగింది.
పాలన బాగుంటే...ఇలా జరగదు
ఎక్కడైనా ఎప్పుడైనా ప్రభుత్వం పరిపాలన సరైన మార్గంలో ఉంటే ఈ తరహా అక్రమాలు చోటు చేసుకోవని హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ తప్పులపై ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే రేపు ఇలాగే మరో ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ లో తలదూర్చే అవకాశం ఉందని హై కోర్టు వ్యాఖ్యానించింది. గుంటూరు జిల్లాల్లో జరుగుతున్నసున్నపురాయి అక్రమ క్వారీయింగ్ కు సంబంధించి ఆడిట్ ఎందుకు చేయలేదని హై కోర్టు కాగ్ న్యాయవాదిని కూడా ప్రశ్నించింది. మైనింగ్పై ఆడిట్ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
భూగర్భ గనులు...జాతీయ వనరులు
అంతేకాదు ఆ అక్రమ మైనింగ్ ఆడిట్కు సంబంధించి కాగ్ నుంచి వివరణ తీసుకుని కోర్టుకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ కె. లక్ష్మణ్ను హై కోర్టు ఆదేశించింది. అక్రమార్కులపై ఐపీసీ 120బీ వంటి సెక్షన్ల కింద ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించింది. భూగర్భ గనులు ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికే చెందినవి కాదని, ఇవి జాతీయ వనరులని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్ట చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.
ఆ కేసులు...పెట్టలేదెందుకు?
ఈ నేపథ్యంలో ఎపి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తూ అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిని గుర్తించి క్రిమినల్ కేసులు పెట్టినట్లు హై కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం జూలై 25న తాము ఆదేశాలు జారీచేశాక 28, 29 తేదీల్లో కేసులు పెట్టారని గుర్తుచేసింది. అక్రమాలకు పాల్పడిన అధికారులను గుర్తించి సస్పెండ్ చేసినట్లు ఏజీ చెప్పడంతో వారిపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని సీజే ఈ సందర్భంగా ప్రశ్నించారు. వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టవచ్చుకదా అన్నారు.
ఇలా చెబితే...అలా చేయడమేంటి?
దీనిపై ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వివరణ ఇస్తూ చట్ట సవరణ అనంతరం ఏసీబీ కేసులు పెట్టాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉందని హై కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన సిజే కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పుడు ప్రభుత్వ అనుమతి ఎందుకు పొందలేదని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్పై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పమంటే...లైసెన్సు తీసుకున్న సంస్థలకు ఫెన్సింగ్ వేసుకోవాలని సూచించడం ఏమిటని నిలదీశారు.
గడువు...వారం మాత్రమే...
ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు ఆగ్రహిస్తేగాని స్పందించరా?...ప్రభుత్వ పాలనలో కోర్టులు జోక్యం చేసుకోవాలా?...సరిహద్దులు చెరిపేసి అక్రమ మైనింగ్ చేస్తుంటే...ప్రభుత్వం ఏం చేస్తోందని హై కోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. ఈ దశలో ఏజీ కల్పించుకుంటూ మూడు వారాలు గడువిస్తే పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతామని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అందుకు నిరాకరించిన ధర్మాసనం వారం రోజులు గడువు మాత్రమే ఇస్తూ...తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.