కేఏ పాల్ పిల్పై హైకోర్టు ధర్మసందేహం- జీపీఏ ద్వారా పిటిషన్ చట్టబద్ధత తేల్చనున్న కోర్టు
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం నష్టాల సాకుతో ప్రభుత్వ రంగ సంస్ధ అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం సరికాదని తన ప్రజా ప్రయోజన వాజ్యంలో కేఏ పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ పిల్ విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ప్రస్తుతంవిదేశాల్లో ఉంటూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేఏ పాల్ ఈ పిల్ దాఖలు చేశారు. జీపీఏ ద్వారా తన నామినీతో హైకోర్టులో ఈ పిల్ వేయించారు. ఇది ఇవాళ విచారణకు వచ్చింది. అయితే జీపీఏ ద్వారా పిల్ దాఖలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలా వేయడం కుదురుతుందా అని కేఏ పాల్ తరపు న్యాయవాదిని న్యాయస్ధానం ప్రశ్నించింది. దీంతో ఆయన వీలవుతుందని జవాబిచ్చారు. కానీ హైకోర్టుకు ధర్మసందేహం మాత్రం తీరలేదు.
జీపీఏ ద్వారా హైకోర్టులో పిల్ దాఖలు చేసే అవకాశం ఉందా లేదా అన్న అంశాన్ని తెలుసుకునేందుకు హైకోర్టు ఈ కేసు విచారణను వాయిదా వేసింది. రూల్ నంబర్ 4 ద్వారా ఇలాంటి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని కేఏ పాల్ తరఫు న్యాయవాది బాలాజీ చేసిన వాదన చట్టబద్ధతను నిర్ధారించేందుకు ఈ కేసు విచారణను వచ్చేవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఈ పిల్ను విదేశాల నుంచి వేసేందుకు వీలు కాదని తేలితే మాత్రం హైకోర్టు తోసిపుచ్చే అవకాశముంది.