సేమ్ సీన్: రోజాను సభలోకి రానివ్వలేదు, గేటు వద్ద బైఠాయింపు
హైదరాబాద్: శుక్రవారం మాదిరే ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హైటెన్షన్ వాతావరణం చోట చేసుకుంది. ఏడాది పాటు సస్పెన్షన్కు గురైన వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ తీర్మానాన్ని ఎత్తివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో అసెంబ్లీకి హాజరయ్యేందుకు ఆమె వచ్చారు.
శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలోకి ఆమెను అనుమతించిన పోలీసులు, శనివారం ఏకంగా గేటు వద్దే ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల వైఖరికి నిరసనగా ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో రోజా మీడియాతో మాట్లాడారు. సభలోకి అనుమతిస్తూ హైకోర్టు తీర్పు చెప్పినా ప్రభుత్వం తనను అడ్డుకుంటుందని రోజా ఆరోపించారు. తమ పార్టీకి న్యాయవాదుల మీద, చట్టాల మీద చాలా నమ్మకం ఉందని పేర్కొన్నారు.
నా హక్కుల పరిరక్షణకు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆమె పేర్కొన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పు ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చానని, అయినా ఏం జరిగిందో చూశారుగా అన్నారు. టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలోకి రాకుండా చేసిందని ఆమె చెప్పారు.
అయితే తనని ఎందుకు సభలోకి రానివ్వడం లేదో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు ఎండలో గంటకు పైగా నిరసన చేపట్టామని, స్పీకర్ సమాధానం కోసం వేచిచూసిన లాభం లేకపోయిందని అన్నారు.
ఆ తర్వాత గవర్నర్ గారిని కలవడానికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. మరోవైపు రోజాను సభలోకి రానిస్తారో లేదో, ఎందుకు అనుమతించడంలేదో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. రోజాను అనుమతించక పోవడంపై నిరసన తెలుపుతూ ఆ పార్టీ సభ్యులు నల్ల దుస్తులతో సభకు వచ్చారు.