అమరావతి పై కొత్త ప్రతిపాదనలు: ఏ కార్యాలయాలెక్కడ: నేడు హైపవర్ కమిటీ కీలక భేటీ..!
అమరావతి రైతులను ఎలా శాంతింపచేయాలనే అంశమే ప్రధాన అజెండాగా హైపవర్ కమిటీ భేటీ కానుంది. మూడు రాజధానుల ప్రతిపాదనల పైన జీఎన్ రావు..బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికల పైన ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఇప్పటికే రెండు సార్లు భేటీ అయింది. ఈ రోజు జరిగే మూడో భేటీ కీలకంగా మారుతోంది.
ఈ నెల 18న కేబినెట్ సమావేశం లోగా కమిటీ రిపోర్టు ఇస్తారనే ప్రచారంతో ఇప్పుడు జరిగేది చివరి సమావేశమా..లేక ప్రభుత్వాన్ని మరింత సమయం కోరుతారా అనేది సైతం ఆసక్తి కరంగా మారుతోంది. అమరావతి నుండి పరిపాలనా రాజధాని విశాఖలకు తరలించాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. దీనికి ముందుగా అక్కడ రైతుల ఆందోళనలపైన స్పందించింది. రైతులకు న్యాయం చేస్తామని చెబుతోంది. ఏ రకంగా న్యాయం చేయాలనేది ఇప్పుడు చిక్కుముడిగా మారింది. ఈ రోజు జరిగే హైపవర్ కమిటీ సమావేశంలో ఇదే ప్రధాన అజెండాగా మారుతోంది.
రైతులకు ఏం చెప్పాలి..ఏం చేయాలి..
అమరావతి రైతుల అంశం ఇప్పుడు ప్రభుత్వం ముందు పెద్ద చిక్కుముడిగా మారింది. మూడు రాజధానుల ప్రతిపాదలను సీఎం జగన్ సభలో ప్రస్తావించి నెల రోజులు కావస్తోంది. అప్పటి నుండి రైతుల ఆందోళ న కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం వారితో చర్చలు జరపలేదు. ఇదే సమయంలో అధికార పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలు అమరావతి లోనే పాలన సాగించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ సమయంలో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఈ రోజు సమావేశంలో రైతుల అంశాల పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టనుంది. అమరావతిలో రైతులకు అమలుచేస్తున్న ప్యాకేజీ, ప్లాట్ల అభివృద్ధికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రభుత్వంలోకి కీలక అధికారులు కొన్ని ప్రతిపాదనలు సిద్దం చేసారు. ప్రత్యేక వ్యవసాయ జోన్..అదే విధంగా కౌలు పెంపు వంటి అంశాలను ఈ భేటీ లో చర్చించి రైతులతో సంప్రదింపులకు వీలుగా రూట్ మ్యాప్ సిద్దం చేసే అవకాశం కనిపిస్తోంది.
భూములు..పెన్షన్ పైనా
గత నాలుగు సంవత్సరాల నుంచి భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ. 30వేల నుంచి రూ. 50వేల వరకు ప్రభుత్వం కౌలు చెల్లిస్తోంది. వ్యవసాయ కూలీలకు నెలకు రూ. 2500 పింఛన్ మంజూరు చేస్తోంది. రైతుల నుంచి సేకరించిన 33వేల 500 ఎకరాల్లో 6వేల ఎకరాల వరకు వివిధ సంస్థలకు గత ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో కొన్నిచోట్ల ప్రభుత్వ భవనాలు నిర్మించాలని నిర్ణయించింది.
కాగా రాజధాని ప్రాంతంలో నిర్దేశించిన రోడ్ల కారణంగా పొలాల మధ్య హద్దులు చెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఈ సమస్యలను ఏరకంగా పరిష్కరించాలనే విషయాన్ని హైపవర్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు అమరావతి - అనంతపరం ఎక్స్ప్రెస్ హైవే, అంతర్గత రహదారుల పనులను సింగపూర్ మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా గత ప్రభుత్వం చేపట్టింది. రాజధాని గ్రామాల్లో ఆర్టీరియల్ రోడ్ల నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఇవికాక కొండవీటి వాగు ముంపునకు సంబంధించి క్యాచ్మెంట్ ఏరియా నుంచి పెద్దఎత్తున కాల్వల తవ్వకం జరిగింది. దీంతో రైతుల పొలాలు గుర్తుపట్టేందుకు వీలులేకుండా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించాలనే విషయమై హైపవర్ కమిటీ చర్చించనుంది.
ఇదే చివరి సమావేశమా..
ఈ సమావేశంలోనే రైతుల అంశంతో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పైనా కమటీ చర్చించనుంది. విశాఖకు పాలనా రాజధాని తరలింపును సచివాలయ ఉద్యోగులు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీంతో వారితోనూ ఓ విడత సమావేశం నిర్వహించాలని కూడా హైపవర్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగులకు ఇప్పటికే కొన్ని ఆఫర్లు ప్రకటించినట్లు ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఇంకా ప్రక్రియ మొదలుకాలేదు.
హెచ్ఓడీలకు మాత్రం వౌఖికంగా విశాఖలో సచివాలయ భవనాలకు సంబంధించి పరిశీలన జరపాలని ఆదేశాలు అందాయి. బోస్టన్ కమిటీలో ఆప్షన్-1 ప్రకారం కొన్ని శాఖలు విశాఖలో, మరికొన్ని అమరావతిలో ఏర్పాటు చేయాల్సి ఉంది. రెండో ఆప్షన్లో మొత్తంగా సచివాలయాన్ని తరలించాలని సూచించింది. వీటిలో ఏ ఆప్షన్కు కమిటీ మొగ్గు చూపుతుందనేది తేలాల్సి ఉంది. అయితే, ఈ నెల 18న కేబినెట్ నాటికే కమిటీ రిపోర్టు ఇవ్వాలని భావిస్తున్నా..మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు సమావేశంలో దీని పైన నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది.