హైటెక్ సిటీ నిర్మించి తప్పు చేశాను..! ఏపి అభివృద్దికి జగనే అడ్డంకి అన్న చంద్రబాబు..!!
Recommended Video
అమరావతి/హైదరాబాద్ : మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు తాను చేసిన అభివృద్దికి తానే పశ్ఛాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. తాను సుధీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేసినా తెలంగాణ మీదనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించానని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఏపీని వదిలి హైదరాబాద్ ను అభివృద్ధి చేసినందుకు బాధ పడుతున్నాని ఆవేదన వ్యక్తం చేసారు చంద్రబాబు నాయుడు.
కానీ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్నింటికీ అడ్డుపడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.హైదరాబాద్ ను అభివృద్ధి చేసి తప్పు చేశానని అన్నారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఎందుకని చాలా మంది ప్రశ్నించారని ఆయన అన్నారు. నేను చేపట్టిన హైటెక్ సిటీ, రింగ్ రోడ్, సైబరాబాద్ నిర్మాణాలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించారని, ఇప్పుడు అదే హైటెక్ సిటీ తెలంగాణకు ఆర్ధిక వనరుగా మారిందని చంద్రబాబు అన్నారు.ఇక అమరావతిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై బాబు తనదైన శైలిలో స్పందించారు.
వైసీపి ప్రభుత్వం అభివృద్దికి అడ్డుగా మారిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. అమరావతికి వరల్డ్ బ్యాంకు లోన్ రిజెక్ట్ చేసిన అంశంపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. అప్పు తెచ్చి రాజధాని కట్టి 25 ఏళ్ల తర్వాత తీరుద్దామన్న ముందుచూపుతో ఆలోచించినట్లు చంద్రబాబు చెప్పారు. దాని కోసమే వరల్డ్ బ్యాంకు లోన్ కు దరఖాస్తు చేశానన్నారు. వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు అభివృద్ధికి అడ్డుపడుతూ అప్పు రాకుండా చేసిందన్నారు.
జగన్ నిర్వాకంతోనే అప్పు ఇవ్వడం లేదని వరల్డ్ బ్యాంకు లేఖ రాసిందని చెప్పారు. చంద్రబాబు ఆరోపణలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందిస్తూ.. అమరావతి అభివృద్ధికి అప్పు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాసిందని, దాన్ని సభలో చదివి వినిపించారు. చంద్రబాబు జీవితాంతం అబద్ధాలు చెబుతూనే ఉంటారని ఆయన విమర్శించారు.