భలే టెక్నాలజీ గురూ!ఫంక్షన్ లలో...చదివింపులకు కూడా హై టెక్ సిస్టమ్
విజయనగరం:మీరిప్పటిదాకా ఎన్నో వేడుకలకు వెళ్లుంటారు...అక్కడే అనేక సార్లు చదివింపులు కూడా పెట్టి వుంటారు. మీరు కానుకగా డబ్బో, గిఫ్టో ఇవ్వగానే అక్కడ ఉన్న అమ్మాయో, అబ్బాయో ఆ వివరాలు ఒక నోట్ బుక్ లో వాటి వివరాలు పద్దు రాసి పెట్టుకోవడం చూసి ఉంటారు.
అయితే విజయనగరం లో ఒక వేడుకకు వెళ్లిన వారంతా అక్కడ చదివింపుల కార్యక్రమం దగ్గర తతంగం చూసి ముందు అవాక్కయ్యారు. ఆ తరువాత వారెవా ఏ టెక్నాలజీ అని ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. కారణం ఏమిటంటే అక్కడ చదివింపుల కార్యక్రమం కూడా అంతా హైటెక్ పద్దతిలో జరిగింది. ఆ పద్దతిలో మీరేం కానుక ఇచ్చారో, దాని గురించి వాళ్లు వివరాలు సరిగ్గా నమోదు చేసారో లేదో అని టెన్షన్ పడక్కర్లేదు. అదెలాగంటారా?...అయితే వివరంగా తెలుసుకోవాల్సిందే...
విజయనగరం జిల్లా నెల్లిమర్ల పట్టణంలోని మున్సిపల్ కళ్యాణ మండపంలో ఓ వ్యక్తి తన కుమార్తె కు ఆఫ్శారీ ఫంక్షన్ ఘనంగా నిర్వహించాడు. ఈ వేడుక సందర్భంగా చదివింపుల కోసం వారు వినియోగించిన టెక్నాలజీ ఈ వేడుకకు హాజరైన వారిని ఆశ్చర్యపరిచింది. ఇంకేముంది ఇందుకు సంబంధించిన వివరాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ అందరినీ అంతగా ఆశ్చర్య పరిచిన ఆ టెక్నాలజీ ఏమిటంటే?...
ఇక్కడ చదివింపుల దగ్గర ఒక ప్రత్యేకమైన కీబోర్డ్ వంటి పరికరం ఏర్పాటు చేశారు. దీన్ని మానిటర్ కు అటాచ్ చేశారు. ఎవరైనా చదివింపులు ఇవ్వగానే దీన్ని ఆపరేట్ చేసేవ్యక్తి ఆ వివరాలు కీబోర్డ్ మీద కొడుతుండగానే ఆ ఎదురుగా ఏర్పాటు చేసిన మానిటర్ మీద చదివింపుల తాలూకూ వివరాలు డిస్ ప్లే అవుతున్నాయి. దీంతో ఇచ్చిన కానుక వివరాలు కరెక్ట్ గా నమోదు చేశారో లేదో, లేదా పేరు వివరాలు సరిగ్గా నమోదయ్యాయో లేదో ననే టెన్షన్ లేకుండా ఎదురుగా ఉన్న స్క్రీన్ మీద ఆయా వివరాలు డిస్ ప్లే అవుతుండటం అతిధులను ఆశ్చర్యపరిచింది.
ఔరా!...ఏం టెక్నాలజీ అనుకుంటూ ఆశ్చర్యంగా తమ వంతు చదివింపులు సమర్పించి వెళుతున్నారు. అయితే మరికొందరు మాత్రం కానుకలు, చదివింపుల వివరాలు గుట్టుగా ఉంటేనే బాగుంటుందని, మనం ఇచ్చిన కానుక ఏంటో ఇంటివారికి తెలిస్తే సరిపోతుందని, వచ్చిన వాళ్లందరికీ తెలియాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. ఎవరైనా పెద్దమొత్తంలో కానుకలు ఇవ్వలేని వారు ఈ పద్దతి వల్ల ఇబ్బంది పడతారని అంటున్నారు. ఏదేమైనా చదివింపుల కోసం కూడా ఇలా ప్రత్యేకమైన టెక్నాలజీ వాడుతున్నారని ఆశ్చర్యంగా చెప్పుకున్నారు.