సిపిఎస్ రద్దు కోసం పోరాటంపై వెనక్కి తగ్గని ఫ్యాప్టో:ఎపి ప్రభుత్వానికి ఇరకాటమే!
అమరావతి:సీపీఎస్ రద్దు కోరుతూ ఉపాధ్యాయ సంఘం ఫ్యాప్టో చేపట్టిన ఛలో అసెంబ్లీ రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉపాధ్యాయ సంఘాలు ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటానికి దిగడం ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం కలిగిస్తుందని అధికార పార్టీ టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. గతకొంతకాలంగా ఎన్ని రకాలుగా సిపిఎస్ రద్దు కోసం ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఫ్యాప్టో ఏకంగా ఛలో అసెంబ్లీ పేరిట అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఆ క్రమంలో వారిని నిలువరించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
అమరావతి రోడ్లేమో అందుకు దెబ్బతిన్నాయి...పనులు చూపిద్దామంటే వర్షం అడ్డొచ్చింది:మంత్రి నారాయణ
ఫ్యాప్టో పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడికి తరలివస్తున్న ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రకాశం బ్యారేజీ నుంచి వెలగపూడి వరకు చెక్పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు...స్కూల్ బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల్ని కూడా తనిఖీలు చేశారు. ఛలో అసెంబ్లీ కి తరలివెళ్లేందుకు ముందుగా ఆయా ఉద్యోగులు విజయవాడ లెనిన్ సెంటర్కు భారీగా చేరుకున్నారు.
మరోవైపు ఈ ఉద్యోగులు అసెంబ్లీకి చేరుకోకుండా పోలీసులు పలుచోట్ల వారిని అదుపులోకి తీసుకొని ఈడ్చుకుంటూ వెళ్లారు. చివరకు మహిళల ఉద్యోగులను సైతం పోలీసులు ఇలాగే ఈడ్చుకెళ్లారు. ఈ విధంగా అదుపులోకి తీసుకున్న ఉద్యోగులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. చాలా చోట్ల తమ పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఉద్యోగులు చెబుతున్నారు.
ఇదే విషయమై పీడీఎఫ్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ సీపీఎస్పై ప్రధాన ప్రతిపక్షం, వామపక్షాలు ఇప్పటికే తమ వైఖరి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. మరి ఈ విషయంలో అధికార పార్టీ టీడీపీ తన వైఖరి వెల్లడించడానికి ఇబ్బందేమిటని వారు నిలదీస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఇలా ఉపాధ్యాయులను ఈడ్చుకెళ్లడం, అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. సీపీఎస్ రద్దు చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్పై చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు.
ఇదిలావుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిపిఎస్ విధానం రద్దు పై సమగ్రంగా సమీక్ష చేస్తున్నట్లు తెలిసింది. మంగళవారం మంత్రులు అచ్చెన్నాయుడు, గంట శ్రీనివాసరావుతో పాటు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులుతో అసెంబ్లీలో తన ఛాంబర్ లో సీఎం చర్చించారు. ఈ చర్చలో భాగంగా కేరళ, తమిళనాడు, తెలంగాణలో అవలంభిస్తున్న విధానాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణ, కేరళలో కేవలం ప్రకటన మాత్రమే చేశారని...ఇంకా విధానం అవలంభిస్తున్నారని అధికారులు సీఎంకి వివరించారు. ఏదేమైనా ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనిపై ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సిపిఎస్ కు ఫుల్ అబ్రివేషన్ ....కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం...అంటే గతంలో ఉద్యోగులకు ప్రభుత్వమే పింఛను మంజూరు చేసేది. అయితే 2004 సెప్టెంబర్ 22న జారీ అయిన జీవో 653 ప్రకారం ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం పద్దతి అమలులోకి వచ్చింది. ఈ పద్దతిలో 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి...మరికొన్ని రాష్ట్రాల్లో 2004 జనవరి 1 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి దీనిని వర్తింపచేశారు.ఈ స్కీంలో బేసిక్ పే, డిఎపై 10 శాతం మేర ప్రతి ఉద్యోగి పించనుకు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. అంతే మొత్తంలో వీరికి రాష్ట్ర ప్రభుత్వం సమానమైన మొత్తాన్ని విరాళంగా అందిస్తుంది. ఈ మొత్తాన్ని వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు పెట్టి, ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఆయా ఉద్యోగుల ఫించనుకు వినియోగిస్తారు.