తూగోలో 'దివిస్' వద్ద ఉద్రిక్తత: లాఠీఛార్జ్, స్పృహతప్పిన కార్యకర్తలు
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో దివిస్ ఫ్యాక్టరీ వద్దని చెబుతూ వామపక్షాలు నిర్వహిస్తున్న బహిరంగ సభ గురువారం ఉద్రిక్తతకు దారి తీసింది. దివిస్ ఫ్యాక్టరీ నిర్వహించవద్దని వామపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు సభ నిర్వహించారు.
ఈ సభను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దివిస్ ఫ్యాక్టరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పలువురు నాయకులను పోలీసులు స్టేషన్ తీసుకు వెళ్లారు. నాయకులు పోలీస్ స్టేషన్ వద్దనే ఆందోళన కొనసాగిస్తున్నారు. తాము సభను ఏర్పాటు చేసుకుంటే అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు.
దివిస్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో మత్స్యకారులు వీధిన పడతారని వామపక్షాలు, ఆందోళనకారులు మండిపడుతున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో సిపిఎం మధు సహా పలువురు ఉన్నారు. దాదాపు రెండు వందల మందిని అరెస్టు చేశారు. వారిని అన్నవరం, పొన్నంగి, తోటనందూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
సభ వద్ద పరిస్థితి అదుపుతప్పేలా ఉండటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. లాఠీఛార్జ్ కారణంగా పలువురు స్పృహ తప్పి పడిపోయారు. సభకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో 144వ సెక్షన్ విధించారు.