పంతం నీదా... నాదా... క్షణ క్షణం ఉత్కంఠ భరితం... ఏపీలో పీక్స్కి ఎన్నికల పంచాయితీ...
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు,రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న యుద్దం తారాస్థాయికి చేరింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిమ్మగడ్డ దూకుడుగా ముందుకెళ్తుండగా... ఎలాగైనా ఆయనకు బ్రేకులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించి తీరాలని నిమ్మగడ్డ.. ఎలాగైనా సరే అడ్డుకుని తీరాలని ప్రభుత్వం భావిస్తుండటంతో... చివరకు ఎవరి పంతం నెగ్గుతుందన్నది ఉత్కంఠగా మారింది. శనివారం(జనవరి 23) తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు నిమ్మగడ్డ సిద్దమవడంతో... ప్రభుత్వం ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నది,ఎలా నిమ్మగడ్డకు బ్రేకులు వేయబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది.
Recommended Video
నేడే తొలి విడత నోటిఫికేషన్...
శనివారం ఉదయం 10గంటలకు తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను నిమ్మగడ్డ విడుదల చేయనున్నారు. తొలి విడతలో భాగంగా 11 జిల్లాలకు సంబంధించి ఒక్కో డివిజన్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో గుంటూరు,చిత్తూరు జిల్లాలను మినహాయించారు. మొత్తం నాలుగు విడతలకు సంబంధించి ఈ నెల 23,27,31,4వ తేదీల్లో నోటిఫికేషన్ విడుదల చేయనుండగా... ఫిబ్రవరి 5,9,13,17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని ఇప్పటికే నిమ్మగడ్డ పంచాయతీ అధికారులను ఆదేశించారు. అలాగే ఈ నెల 25వ తేదీకల్లా ఓటర్ల జాబితా సిద్దం చేయాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించారు. మొత్తంగా ప్రభుత్వ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణ దిశగా వేగంగా చర్యలు చేపడుతున్నారు.
ప్రభుత్వం ఏం చేయబోతుంది..?
ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్తో ఇప్పటికే సుప్రీంలో సవాల్ చేసింది. అయితే ఈ పిటిషన్ సోమవారం(జనవరి 24) విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం,ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను కూడా సుప్రీం తిరస్కరించింది. అయినప్పటికీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీకి సహకరించే పరిస్థితులు ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తదుపరి వ్యూహం,చర్యలు ఎలా ఉండబోతున్నాయన్నది ఉత్కంఠ రేపుతోంది. మొత్తంగా శనివారం నాడు రాష్ట్రంలో ఎస్ఈసీ,రాష్ట్ర ప్రభుత్వం మధ్య మరోసారి హైడ్రామా తప్పేలా లేదు.
సీఎస్ లేఖ రాసినా...
ఎస్ఈసీ తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ నిమ్మగడ్డకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ, ప్రభుత్వం ఉమ్మడిగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను లేఖలో ఆయన గుర్తుచేశారు సీఎస్. పోలింగ్, వ్యాక్సినేషన్ రెండూ ఏకకాలంలో నిర్వహించడం సాధ్యం కాదన్నారు. ఎస్ఈసీకి చెప్పిన విషయాలన్నీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో ఉన్నాయని... సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ వేచి చూడాలని ఎస్ఈసీని కోరారు సీఎస్. అప్పటివరకూ నోటిఫికేషన్ విడుదల చేయవద్దని కోరారు. అయితే నిమ్మగడ్డ మాత్రం ప్రభుత్వ అభ్యంతరాలను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ సుప్రీం కోర్టులోనూ నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వస్తే... ప్రభుత్వం ఇక చేసేది ఏమీ ఉండదనే చెప్పాలి.