తుళ్లూరులో హైటెన్షన్: బస్సుయాత్రకు పోలీసుల బ్రేక్, మహిళా రైతుల అరెస్ట్, మొబెల్స్ లాక్కొని..
అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సు యాత్రకు పోలీసులు బ్రేకులేశారు. తూళ్లూరు వద్ద అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ బస్సులను పోలీసులు నిలిపివేశారు. వాస్తవానికి జేఏసీ ఆర్టీఏ పర్మిషన్ తీసుకొని బస్సుయాత్ర చేపడుతోంది. కానీ తమ అనుమతి కూడా తీసుకోవాలని.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ వెళతారో రూట్మ్యాప్ కూడా ఇవ్వమని పోలీసులు అడగడంతో.. బస్సుయాత్ర ఆగిపోయింది.
బస్సు టు పీఎస్..
బస్సులో ఉన్న మహిళా రైతులను పోలీసులు అడ్డుకొన్నారు. బస్సుల్లోంచి దింపి మందడం డీఎస్పీ ఆఫీసు వద్దకు పంపించారు. ఈ క్రమంలో పోలీసులతో మహిళా రైతుల మధ్య వాగ్వివాదం జరిగింది. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని రైతులు ప్రశ్నించారు. రైతుల యాత్రకు అనుమతి లేదని డీఎస్పీ చెప్పడంతో అన్నదాతల కోపం నాశలానికి ఎక్కంది.
మొబైల్స్ ఎందుకు తీశారు..
మరోవైపు మందడం డీఎస్పీ ఆఫీసు వద్ద మహిళా రైతుల ఉండగా.. అక్కడికి భారీగా రైతులు చేరుకుంటున్నారు. వెలగపూడి, తుళ్లూరు, మందడం నుంచి అన్నదాతలు వస్తున్నారు. కొందరు రహదారిపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బస్సులో ఉన్న 20 మంది మహిళా రైతులను ఎందుకు దింపారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాక వారి వద్ద నుంచి మొబైళ్లను కూడా లాక్కొవడం సరికాదంటున్నారు.
ఆధార్ ఉంటే బయటకి రావలా..?
తాము ఆధార్ కార్డు ఉంటే తప్ప బయటకి వెళ్లలేమా అని రైతులు పోలీసులను నిలదీస్తున్నారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని వాదనకు దిగారు. మహిళా రైతులను పోలీసులు అడ్డుకోవడంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గత 22 రోజుల నుంచి అమరావతి ప్రాంత రైతులు రాజధానిని మార్చొద్దని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. బస్సుయాత్రలో మహిళా రైతులు భాగస్వాములు కాగా.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.