చంద్రబాబు నివాసం వద్ద హైటెన్షన్ : ముగ్గరు మంత్రుల అడ్డగింపు : ఇంటిని ముంచేందుకు కుట్ర..!!
ఏపీ రాజధాని అమరావతిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఇంకా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు నివాసంలోని వరద నీరు వచ్చిందనే సమాచారంతో ఉదయం నుండి అక్కడ రాజకీయం వేడెక్కింది. మాజీ ముఖ్యమంత్రి నివాసంలోకి వరద నీరు వచ్చిందనే సమాచారంతో అందరూ అలర్ట్ అయ్యారు. ఆ తరువాత డ్రోన్ కెమేరా చంద్రబాబు నివాసం వద్ద కనిపించటంతో టీడీపీ నేతలు అందోళనకు దిగారు.
పోలీసులు లాఠీఛార్జ్ చేసారు. అయితే, తామే వరద పరిస్థితి అంచనా వేసేందుకు డ్రోన్ కెమేరాను వినియోగించామని ప్రభుత్వం ప్రకటించింది. తమ మీద కుట్రలు చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి ఫిర్యాదు చేసారు. మరో వైపు చంద్రబాబు నివాసం ముంచేందుకే ప్రభుత్వ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందంటూ మాజీ మంత్రి ఉమా ఆరోపించారు. ఇదే సమయంలో చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లిన ముగ్గురు మంత్రులను టీడీపీ నేతలు అడ్డుకున్నారు.
మంత్రులు అడ్డగింపు..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద వరదీ నీటిని పరిశీలించేందుకు వెళ్లిన ముగ్గురు మంత్రులకు నిరసన వ్యక్తం అయింది. మంత్రులు బొత్సా సత్యనారాయణ.. అనిల్.. వెల్లంపల్లి శ్రీనివాస్..ఎమ్మెల్యే మల్లాది విష్ణు కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది లోనికి అనుమతించ లేదు. నివాసం లోపలకు ఎవరినీ అనుమతించవద్దని చెప్పారంటూ సిబ్బంది అడ్డుకున్నారు. ఆ సమయంలో టీడీపీ నేతలు..కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అక్కడి నుండి మంత్రులు వెళ్లిపోవాలని డిమాండ్ చేసారు. వరద ప్రాంతాలకు వెళ్లని మంత్రులకు చంద్రబాబు నివాసం వద్ద పని ఏంటని ప్రశ్నించారు. ఉదయం నుండి చంద్రబాబు నివాసం వద్దనే ఉన్న టీడీపీ శ్రేణులు ప్రభుత్వ ఉద్దేశ పూర్వంగానే తమ మీద పోలీసులతో దాడులు చేయింస్తోందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ముగ్గురు మంత్రులు అక్కడి నుండి తిరిగి వెళ్లి పోయారు. వరద పరిస్థితిని సమీక్షించేందుకు మాత్రమే తాము వచ్చామని మంత్రులు వివరించారు. అయినా అక్కడి టీడీపీ కార్యకర్తలు మాత్రం వీరికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పోలీసులు రంగ ప్రవేశం చేయటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అక్కడి నుండి వెళ్లిపోయిన మంత్రులు కరకట్ట మీద ఉన్న నిర్మాణాల్లో వదర పరిస్థితిని పరిశీలించారు.
ఆవేశంతో ఊగిపోయిన దేవినేని ఉమా..
మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రభుత్వ తీరు మీద మండి పడ్డారు. క్రిష్టా పరివాహక ప్రాంతంలో ఏ కాల్వకు లేనిది ఇక్కడ మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో వచ్చిందని ప్రశ్నించారు. ప్రవాహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ వరద లేదని..కేవలం అమరావతిని..చంద్రబాబు ఇంటిని ముంచేందుకే ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. వరద వచ్చిన సమయంలో ఎలా వ్యవహరించాలో కూడా తెలియని వారు పాలన చేస్తున్నారని మండి పడ్డారు. డ్రోన ద్వారా చంద్రబాబు భద్రత పైన కుట్ర చేసారని.. నీటి ప్రవాహం ఉద్దేశ పూర్వకంగా విడుదల చేయటం ద్వారా మొత్తం అమరావతికే నష్టం చేయాలని ప్రభుత్వం ఆలోచన అంటూ దేవినేని ఫైర్ అయ్యారు. అయితే, మంత్రి అనిల్ మాత్రం మాజీ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. తాము పూర్తిగా ప్రణాళికా బద్దంగానే నీటిని విడుదల చేస్తున్నామని..ఎక్కడా నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. మూడు రోజులుగా తమ శాఖ ఆద్వర్యంలో డ్రోన్ కెమేరా ద్వారా వదర అంచనా వేస్తున్నామని..రాజకీయ పబ్బం కోసమే టీడీపీ నేతలు రగడ చేస్తున్నారంటూ మంత్రి అనిల్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
చంద్రబాబు ఇంటి వద్ద పర్యవేక్షణ..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వద్ద టీడీపీ నేతలు భారీగా మొహరించారు. కలెక్టర్ ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి నివాసం పరిశీలించారు. మరో వైపు ప్రకాశం బ్యారేజీకి మరింత ఫ్లో వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎనిమిదిన్నార లక్షల వరకు ఇన్ ఫ్లో రావచ్చాని చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లోకి నీరు వచ్చిందని తెలుస్తోంది. రాయపూడి వద్ద వరద వస్తుందని తెలిసిన ప్రభుత్వం గేట్ మూయకుండా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో వరద వచ్చిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి..చంద్రబాబు మీద కుట్రలో భాగంగానే ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వరద కొనసాగినంత కాలం ఈ వరద రాజకీయం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.