పొలాల్లో హై టెన్షన్ విద్యుత్ లైన్లకు అధికారుల ప్రయత్నం:ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత
అమరావతి:పొలాల్లో నుంచి హై టెన్షన్ విద్యుత్ తీగలు లాగే క్రమంలో తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మా అనుమతి లేకుండానే మా వ్యవసాయ భూముల్లో కరెంట్ హైటెన్షన్ లైన్ ఏర్పాటు చేస్తున్నారంటూ ఉండవల్లి గ్రామ రైతులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
హైటెన్షన్ లైన్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న అధికారులను అడ్డుకున్నారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో భారీగా తరలివచ్చిన పోలీసు బలగాలు రైతులను, వారి కుటుంబ సభ్యులను అక్కడ నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నడిబొడ్డున ఉన్న తాడేపల్లి మండలం ఉండవల్లిలో హై టెన్షన్ విద్యుత్ లైన్ల ఏర్పాటు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ పొలాల్లో విద్యుత్ హైటెన్షన్ లైన్ ఏర్పాటు చేయ్యొదంటూ స్థానిక రైతులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించగా అక్కడకు భారీ సంఖ్యలో తరలివచ్చిన పోలీసులు రైతులను అక్కడనుంచి పంపించే ప్రయత్నం చేశారు.
దీంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో పోలీసులు రైతులను, వారి కుటుంబ సభ్యులను బలవంతంగా అక్కడినుంచి తరలించే ప్రయత్నం చేయగా రైతులు తమ వెంట తెచ్చిన పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో పోలీసులు రైతులను అడ్డుకొని అరెస్ట్ చేశారు.
రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినా వారి కుటుంబ సభ్యులు ప్రధానంగా మహిళలు పొలాల వద్దే ఉండి విద్యుత్ లైన్ల పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రైతుల కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు ఇలా బలవంతంగా తమ పొలాల్లోనుంచి విద్యుత్ లైన్లు వెయ్యాలని చూడటం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దానివల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. విద్యుత్ లైన్లను తాము అసలు వేయొద్దని అనడం లేదని...పొలాల మధ్య గుండా కాకుండా ఒక పక్క నుంచి వేసుకోవాలని సూచించినా అధికారులు ససేమిరా అంటున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వలేదనే కక్ష్యతో ప్రభుత్వం ఇలా చేస్తుందేమోననే సందేహాలున్నాయన్నారు.
అధికారులు ఇలా తమ పొలాల్లో ఎక్కడ విద్యుత్ లైన్లు వేస్తారో అని నెల రోజుల నుంచి పొలాలకు కాపలాగా ఉంటున్నామని, చివరకు ఇప్పుడు బలవంతంగా అందుకు సిద్దపడ్డారని వాపోయారు. మహిళలని చూకుండా తమని కూడా అరెస్ట్ చేస్తామని అంటున్నారని, అలా అరెస్ట్ చేసి ఎక్కడకు తీసుకెళ్లి ఏం చేస్తారోనంటూ ఆందోళన వ్యక్తం చేశారు.