బాబు సర్కార్కు హైకోర్టు షాక్: ప్రైవేటు కాలేజీ ఫీజులపై చర్యలేవి?
రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటుతో దీనికి చెక్ పెట్టాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాది రఘునందన్ రావు హర్షకుమార్ తరుపున వాదించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు కాలేజీలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తుంటే.. ఏం చేస్తున్నారంటూ అధికారులను, ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇప్పటిదాకా దీనిపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎన్ని కాలేజీలను తనిఖీ చేశారో చెప్పాలంటూ అధికారులను ప్రశ్నించింది.
త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను హైకోర్టుకు సమర్పించాలని ఏపీ సర్కార్, ఇంటర్ బోర్డులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ టి.రజనిలతోకూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ప్రైవేటు కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటుతో దీనికి చెక్ పెట్టాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాది రఘునందన్ రావు హర్షకుమార్ తరుపున వాదించారు.
ఇంటర్ తొలి సంవత్సరానికి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు రూ.2500గా ఉంటే ప్రైవేటు కాలేజీలు మాత్రం దానికి కొన్ని రెట్లు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని కోర్టుకు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం తరుపు న్యాయవాది.. హర్షకుమార్ గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు దీనిపై ఎప్పుడూ నోరు మెదపలేదన్నారు.
ఫీజులు నియంత్రణ ఇంటర్ బోర్డు చూసుకుంటుందని వాదించారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత ప్రభుత్వం, ఇంటర్ బోర్డు ఫీజుల నియంత్రణపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించింది. తదుపరరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.