కోడెలను బెంబేలెత్తిస్తోన్న 'ఫోన్ కాల్స్' భయం!! దొరికిపోతారా!?
విజయవాడ : ఓవైపు చంద్రబాబు ఓటుకు నోటు కేసు తెరపై ఉండగానే.. మరో టీడీపీ నేత ఫోన్ కాల్స్ వ్యవహారం ఇప్పుడు వివాదాలకు తావిస్తోంది. నరసారావుపేటలో కొద్దిరోజుల క్రితం నల్లపాటి కేబుల్ విజన్ (ఎన్సీవీ) కార్యాలయం ధ్వంసం అయిన కేసుకు సంబంధించి.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫోన్ కాల్స్ మేరకే పోలీసులు కార్యాలయాలన్ని ధ్వంసం చేశారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు బాధితుడు.
ఫోన్ ద్వారా పోలీసులకు ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్న కోడెల, ఆయన కుమారుడు శివకుమార్.. ఫోన్ కాల్స్ ద్వారానే కార్యాలయంపై దాడి జరిగే పరిస్థితులను తయారు చేశారని, ఆ ఘటన వెనుక ఇద్దరి హస్తముందని ఆరోపిస్తూ.. బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా బాధితుడు హైకోర్టును కోరాడు.
బాధితుడి పిటిషన్ నేపథ్యంలో.. స్పీకర్ కోడెల, ఆయన కుమారుడు శివకుమార్ సహా గుంటూరు ఎస్పీ నారాయణ నాయక్, పోలీసులు నాగేశ్వరరావు,వీరయ్య చౌదరి, సాంబశివరావు, సురేంద్రబాబు, శ్రీనివాసరావు, లోకనాథంకు నోటీసులు జారీ చేసింది కోర్టు. కోడెల ఫోన్ కాల్స్ గురించి పిటిషన్ లో ప్రధానంగా ప్రస్తావించిన నేపథ్యంలో.. కోడెలతో పాటు నిందితులుగా పేర్కొంటున్న వారందరీ ఫోన్ కాల్ డేటాను సేకరించాల్సిందిగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లయిన ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్,వొడాఫోన్,ఐడియా సంస్థలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గత నెల 10,11 తేదీల్లో దాడి జరిగిన నేపథ్యంలో.. ఆ రెండు రోజులకు సంబంధించిన కాల్ డేటాను సమర్పించాల్సిందిగా ఆదేశాలు వెలువరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. స్పీకర్ కోడెలకు కొత్త భయం పట్టుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేసులో అభియోగాలు గనుక నిరూపితమైతే కోడెల తీవ్ర ఇరకాటంలో పడడం ఖాయం కాబట్టి.. విచారణలో ఎలాంటి నిజాలు నిగ్గు తేలుతాయో వేచి చూడాలి.