వక్రీకరించారా?: ఆంధ్రజ్యోతి ఆర్కేకు షాక్.. వచ్చి తీరాల్సిందేనన్న హైకోర్టు..
Recommended Video
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు హైకోర్టు షాక్ ఇచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు హాజరు కాలేనంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది.
క్వాష్ పిటిషన్ తిరస్కరణ నేపథ్యంలో ఎండీ రాధాకృష్ణతో పాటు ఎడిటర్ కె.శ్రీనివాస్, పబ్లిషర్ సహా మరికొంతమంది ఉద్యోగులు విచారణకు హాజరుకావాల్సిందే. ఇటీవల ఈ కేసు విచారణ సందర్భంగా వీరెవరూ నాంపల్లి కోర్టుకు హాజరుకాకపోవడం.. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిన సంగతే.
డిసెంబర్ 5న:
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కోర్టుకు రాలేకపోతున్నామంటూ రాధాకృష్ణ క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు. న్యాయస్థానం దీన్ని తప్పుపట్టింది. డిసెంబర్ 5న జరగనున్న తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరై తీరాల్సిందేనని ఆదేశించింది.
ఎందుకీ పిటిషన్:
ఈ ఏడాది మే నెలలో ఏపీకి ప్రత్యేక హోదా, కరువు అంశాలపై చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వైసీపీ అధినేత జగన్ కలిశారు.
భేటీకి సంబంధించి మరునాడు వార్తను ప్రచురించిన ఆంధ్రజ్యోతి.. వాస్తవాలను పూర్తిగా వక్రీకరించిందని వైసీపీ ఆరోపించింది. ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. కోర్టుకు స్వయంగా హాజరుకావాల్సిందేనని ఆదేశించింది.
ఆంధ్రజ్యోతి ఏం ప్రచురించింది?:
'జైలు రోజులు దగ్గరపడ్డందుకే జగన్ ప్రధాని కాళ్లు పట్టుకున్నారు' అన్న హెడ్ లైన్ తో ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం పూర్తిగా వక్రీకరణ అనేది వైసీపీ ఆరోపణ. రాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా మద్దతు తెలిపే బదులు ప్రత్యేక హోదాతో ముడిపెట్టాల్సింది కదా? అని ఆ కథనంలో ప్రశ్నించారు.
అలాగే విపక్ష పాత్ర మరిచి జగన్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని, భేటీని ఇంత రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఎన్ని డ్రామాలాడినా ఈడీ నుంచి జగన్ తప్పించుకోలేరని మంత్రులు ధ్వజమెత్తినట్లుగా అందులో పేర్కొన్నారు.
కోర్టు ఏం తేలుస్తుందో?:
రాజకీయ పార్టీలన్ని పత్రికలను తమకు అనుకూలంగా మలుచుకోవడమో.. లేక సొంత పత్రికలు నడుపుకోవడమో చేస్తున్న రోజులివి. దీంతో ప్రత్యర్థి పార్టీలను విమర్శించడానికి, బురద జల్లడానికి వార్తా పత్రికలే వేదికగా మారాయి. రాజకీయాల పేరుతో వాళ్ల మీద వీళ్లు, వీళ్ల మీద వాళ్లు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజా కేసుకు సంబంధించి న్యాయస్థానం ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది.