పీపీఏ ల విషయంలో హైకోర్టు తీర్పు .. జగన్ ప్రభుత్వానికి చెంప పెట్టు.. టీడీపీ నేతల ఎద్దేవా
విద్యుత్ పీపీఏల విషయంలో హైకోర్టు తీర్పు ఏపీ సీఎం వైయస్ జగన్ సర్కార్ కు చెంపపెట్టు అని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు ఎద్దేవా చేశారు. దేవినేని ఉమా ఇకనైనా కీన్స పరిజ్ఞానంతో ప్రవర్తించాలని సూచించారు. జగన్ పాలన మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. విద్యుత్ పీపీఏల సమీక్ష చెయ్యాలనే జగన్ ప్రభుత్వ జీవోను రద్దు చేస్తూ హై కోర్టు తీసుకున్న నిర్ణయంపై టిడిపి నేతల నుండి హర్షం వ్యక్తమవుతోంది. వైసీపీ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గుంటూరులోని టిడిపి రాష్ట్ర కార్యాలయంలో హైకోర్టు తీర్పు గురించి మాట్లాడిన టీడీపీ నేతలు ఎవరు చెప్తున్నా వినకుండా ఒంటెద్దు పోకడలు పోయిన జగన్ కు హై కోర్టు కర్రు కాల్చి వాత పెట్టిందని చెప్పారు. కళా వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్ సమీక్షలన్నీ కమీషన్ల కోసమేనని ఆరోపణలు గుప్పించారు. పిపిఎలపై ప్రభుత్వం ఇచ్చిన జిఒ 63ను హైకోర్టు రద్దు చేయడం ప్రభుత్వానికి చెంపపెట్టన్న ఆయన, పిపిఎలపై నిందలు వేసిన సిఎం జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
టిడిపి అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు సైతం హైకోర్టు తీర్పుపై మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం కనీస పరిజ్ఞానం లేకుండా నిర్ణయాలు తీసుకున్న ఫలితమే హైకోర్టు తీర్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక శక్తి వనరుల విషయంలో రివర్స్లో వెళ్తోందని చెప్పిన బోండా ఉమా పిపిఎల విషయంలో ధరలు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదనే కనీస పరిజ్ఞానం వైసిపి నాయకులకు లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకే పిపిఎల ఒప్పందం జరిగిందన్నారు. ఈ విషయాన్ని కేంద్రమే స్పష్టం చేసినా జగన్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లారని పిపిఎలపై హైకోర్టు తీర్పు కర్రుకాల్చి వాతపెట్టిన చందంగా తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో టెర్రరిస్ట్ పాలన సాగుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రగతిపై దృష్టి సారించాలని హితవు పలికిన టీడీపీ నేతలు పరిపాలనపై అవగాహన లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలతో కోర్టు అక్షింతలు వేసిందన్నారు. ఇకనైనా జగన్ వైఖరి మార్చుకుని , కాస్త పరిజ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు.