ఏపీలో కరోనా డెంజర్ బెల్స్: దేశంలో నాలుగో స్థానానికి, 5,6 రోజుల్లో మూడో స్థానం..? నిపుణుల ఆందోళన
కరోనా మహమ్మరి విలయ తాండవం చేస్తోంది. దేశంలో కేసులు భారీగా పెరుగుతుండగా.. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సిచుయేషన్ కొనసాగుతోంది. ఇప్పుడు దేశంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానానికి చేరింది. మరో ఐదారు రోజుల్లో మూడో స్థానంలో ఉన్న ఢిల్లీని దాటేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకు రోజు నమోదయ్యే పాజిటివ్ కేసుల గణాంకాలను వివరిస్తున్నారు. దేశంలో రెండో స్థానంలో ఉన్న తమిళనాడుతో సమానంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
Recommended Video
నాలుగో స్థానంలో ఏపీ..
90 వేల 942 కేసులతో శనివారం వరకు కర్ణాటక నాలుగో స్థానంలో ఉండేది. ఐదో స్థానంలో ఏపీ కొనసాగుతూ వచ్చింది. కానీ ఆదివారం ఆంధ్రప్రదేశ్లో 7 వేల 627 పాజిటివ్ కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 96 వేల 298కి చేరింది. దీంతో కరోనా కేసుల్లో నాలుగో స్థానానికి చేరింది. అత్యధిక కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో తమిళనాడు రెండో స్థానంలో ఉన్నాయి. లక్ష 30 వేల 606 కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో ఉండగా.. నాలుగు ఏపీ, ఐదో స్థానానికి కర్ణాటక చేరింది.
15వ స్థానం నుంచి 4కి..
వాస్తవానికి కరోనా వైరస్ బయటపడిన తొలినాళ్లలో ఏపీలో కేసులు సంఖ్య అంతగా లేదు. దేశంలో 15వ స్థానంలో ఉండేది. కానీ 4 నెలల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో రోజుకు 7 వేల కొత్త కేసులు నమోదవుతుండటంతో సంఖ్య పెరుగుతుంది. అదే ఢిల్లీలో రోజుకు యావరేజీగా 1200 కేసులు వస్తున్నాయి. ఏపీలో పరిస్థితి ఇలానే కొనసాగితే ఢిల్లీని దాటడం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెద్ద రాష్ట్రాల్లో ఇలా..
ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహర్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో లక్ష మందిని పరీక్షిస్తే రోజుకు 500 నుంచి 1000 వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కానీ ఏపీలో కనీసం 1884 వరకు వస్తున్నాయి. ఇది 2 వేలకు చేరుకుంటే తమిళనాడుతో సమానమవుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక్కరోజు 13 శాతం..
15 పెద్ద రాష్ట్రాల్లో పరీక్షించిన శాంపిళ్లలో 2-8 శాతం వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఇదీ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో 8-12 శాతం ఉంటుంది. కానీ ఏపీలో ఆదివారం ఒక్కరోజు నాటి లెక్కల ప్రకారం 13 శాతానికి చేరుకుంది. గత 15 రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య 8 నుంచి 13 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో లక్ష మందికి 2999, తమిళనాడులో 2823 మంది, కర్ణాటకలో 1382 మందికి వస్తున్నారు. అయితే ఏపీలో ఇప్పుడు 1884 కాగా.. 15 రోజుల క్రితం అదీ 1200గా ఉండేది. అంటే ఈ సమయంలోనే దాదాపు 700 కేసులు పెరిగి డేంజ్ బెల్స్ మోగిస్తున్నాయి. పరిస్థితి ఇలనే కొనసాగితే.. కేసుల సంఖ్య పెరిగి ఏపీ తమిళనాడుతో సమానంగా నిలిచే అవకాశం ఉంది అని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.