ఎస్ఐ కావడమే తన టార్గెట్ అంటోన్న హిజ్రా : కర్నూలు ఎస్పీకి విన్నపం
కర్నూలు : లింగ వివక్ష వల్ల సమాజంలో హిజ్రాలకు జీవనోపాధి దొరకని పరిస్థితులు ఉన్న విషయం తెలిసిందే. దీంతో అటు ఇంటికీ కాక, ఇటు బయటి సమాజంలో బ్రతకలేక అత్యంత దుర్భర పరిస్థితుల్లో కాలం వెళ్లదీసే హిజ్రాలు దేశంలొ ఎంతోమంది ఉన్నారు. అయితే ఇటీవలే తమిళనాడుకు చెందిన ఓ హిజ్రాకు మహిళల కోటా కింద ఎస్ఐ పోస్టును కేటాయించడంతో మిగతా హిజ్రాల్లోను ఆశలు చిగురిస్తున్నాయి.
తాజాగా కర్నూల్ జిల్లా నంద్యాలలో ఓ హిజ్రా తాను ఎస్ఐ అయ్యేందుకు సహకరించాలని స్థానిక ఎస్పీ ని కోరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నేత్రదానం పట్ల అవగాహన కల్పిస్తోన్న జిల్లా ఎస్పీ రవికృష్ణ, అదే కార్యక్రమంలో భాగంగా స్థానిక రస్తా పాత కేసీ కెనాల్ భవన సముదాయంలో ఉన్న సమతా హిజ్రాల సంఘం కార్యాలయానికి వెళ్లారు.
దీంతో మాధురి అనే హిజ్రా తనకు ఎస్ఐ కావాలనే ఆశయం ఉందన్న విషయాన్ని ఎస్పీతో వ్యక్తపరిచింది. డిగ్రీ వరకు చదువుకున్న తాను, ఆ తర్వాత పీజీ చేయాలని ప్రయత్నించినా..! హిజ్రా అన్న కారణంగా, తనకెవరూ సీటు ఇవ్వలేదని వాపోయింది. జిల్లాలోని నందికొట్కూరు తాలూకా విపనగండ్ల తన స్వగ్రామంగా ఈ సందర్బంగా ఎస్పీతో చెప్పింది.
హిజ్రా సమస్యల గురించి ఎస్పీ వద్ద ప్రస్తావించిన మాధురి.. 'కేంద్ర ప్రభుత్వం హిజ్రాలకు గుర్తింపునిచ్చినా, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని' ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సందర్బంగా తమిళనాడులో హిజ్రాకు ఎస్ఐ గా పోస్టింగ్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించిన ఆమె, అదే తరహాలో తనకు ఎస్ఐ పోస్టు వచ్చేలా సహకరించాలని ఎస్పీని కోరింది.
కాగా, మాధురి వినతిపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ రవికృష్ణ, మాధురి ఎస్ఐ అయ్యేందుకు సహకరిస్తానన్నారు. ఇందుకోసం మాధురికి పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ అందజేస్తామని చెప్పిన ఎస్పీ, మాధురి ఎస్ఐ సెలక్షన్స్ లో పాల్గొనేందుకు పై అధికారులతో మాట్లాడుతానన్నారు.