రంగంలోకి హిజ్రాలు...టిడిపి ఎమ్మెల్యే జేసీ సంచలనం:వ్యూహంతోటేనంటున్న పార్టీ శ్రేణులు
అనంతపురం:జెసి బ్రదర్స్ ఏమి చేసినా సంచలనం అవుతుందో?...లేక సంచలనం అవ్వాలనే అలా చేస్తారో తెలియదు కానీ ఈ అన్నాదమ్ముళ్లు ఇద్దరూ ఏ పని చేసినా సెన్సేషనే!...వద్దన్నా పబ్లిసిటీ తన్నుకుంటూ వస్తుంది. ఇదిగో ఇదే క్రమంలో తాజాగా ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ చేసిన ఒక ప్రకటన సంచలనం సృష్టిస్తోంది.
అంతేకాదు అనంతపురం తాడిపత్రి టిడిపి నేతల్లో కలకలం రేపుతోంది. ఇంతకూ ఆ ప్రకటన ఏమిటంటే?...వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మూడు వార్డులను హిజ్రాలకు కేటాయిస్తానని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఎనౌన్స్ చేశారు. అయితే ఇలా ప్రకటించడం వెనుక ఖచ్చితంగా వ్యూహం ఉందంటున్నారు స్థానిక టిడిపి నేతలు...తమ వ్యతిరేకులను సాగనంపే ప్రక్రియలో భాగంగా జెసి బ్రదర్స్ ఈ ప్లాన్ వేశారంటున్నారు...వివరాలు ఇవి
తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల్లో ముగ్గురు హిజ్రాలను రంగంలోకి దింపనున్నట్లు టిడిపి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ప్రకటించడం వెనుక గట్టి వ్యూహమే ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో ఉండి వివాద రహితంగా ఉన్న ముగ్గురు కౌన్సిలర్లకు పొమ్మనలేక పొగపెట్టేందుకే జెసి ప్రభాకర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారు.
గత ఎన్నికల్లో ఇక్కడ 3వ వార్డులో టీడీపీ, వైసీపీ తరపున అన్నదమ్ములైన నియాజ్బాషా, మున్నా పోటీచేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఎన్నికల అనంతరం వార్డులో పట్టు సాధించేందుకు నియాజ్బాషాకు ఎమ్మెల్యే కోఆప్షన్ మెంబర్ కట్టబెట్టారు. అయితే ఎన్నికల ముందు ఎడ ముఖం పెడ ముఖంగా ఉన్న ఈ అన్నదమ్ములిరువురూ ప్రస్తుతం కలసిపోయారు. దీనికి ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న పలు పరిణామాలు కూడా కారణమట.
దీన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఎన్నికల్లో నియాజ్భాషా ను పోటీ నుంచి తప్పించి అతడి స్థానంలో ఒక హిజ్రాను టీడీపీ తరపున పోటీ చేయించాలనే ఆలోచనలో ఎమ్మెల్యే ఉన్నారని టాక్. అలాగే 23వ వార్డు టీడీపీ కౌన్సిలర్గా ఉన్న జయచంద్రారెడ్డి తరుచూ వివాదాల్లో చిక్కకుంటుండటం...పైగా ఏకంగా ఎమ్మెల్యేపైనే విమర్శలు కురిపించడంతో ఈయన్ని ఆల్రెడీ టార్గెట్ చేసిన జెసి...మున్సిపాలిటీపై అసత్య ఆరోపణలు చేశాడన్న నెపంతో ఇటీవలే టీడీపీ నుంచి సస్పెండ్ చేయించారని చెప్పుకుంటున్నారు. సో, ఇక్కడ కూడా హిజ్రానే పోటీలోకి దింపుతారట.
ఇక 30వ వార్డులో టీడీపీ తరపున కౌన్సిలర్గా ఉన్న బాల సుబ్రహ్మణ్యం వివాదరహితుడిగా పేరున్నా ఆయనను కూడా తప్పించి అక్కడ కూడా హిజ్రాను పోటీలో నిలపాలని ఎమ్మెల్యే ఆలోచనలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. అయితే అందుకు కారణం ఏమిటో పార్టీ శ్రేణలకే అంతుబట్టడం లేదట. మొత్తం మీద జెసి ఇలా ఒక్క ప్రకటనతో తనకు నచ్చని అస్మదీయులు, తస్మదీయులు ముగ్గుర్నితప్పించే స్కెచ్ వేయడం, అలాగే హిజ్రాల ఓట్లు...వారి బంధుగణాల ఓట్లు తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్లాన్ చేయడం చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతున్నారట. హిజ్రాలకు ఎమ్మెల్యే ఇచ్చిన హామీని బట్టిచూస్తే ఎమ్మెల్యే జేసీ వ్యూహాలు, ఎత్తుగడలు అనూహ్యమని...అంచనాలకు అందని ఆయన ప్లాన్లను ప్రత్యర్థులు ఎలా ఎదుర్కొంటారోనని పార్టీ శ్రేణులు చర్చించుకుంటుండటం కొసమెరుపు.