నిమిషాల్లో: అమ్మాయిల్ని కాపాడి, పట్టుతప్పి గల్లంతు
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది ప్రవాహంలో గల్లంతై.. మృతి చెందిన విద్యార్థుల్లో పలువురు తమ తోటి విద్యార్థులను కాపాడి... వారు మృత్యువాత పడ్డారు. వారిలో ముఖ్యంగా కిరణ్, ఆశిష్ అనే విద్యార్థులు తోటి విద్యార్థులను ఒడ్డుకు చేర్చారు. ప్రవాహ తీవ్రతకు తాము కొట్టుకొని పోతున్నా.. మిగతా విద్యార్థులను ఒడ్డుకు చేర్చాలని కిరణ్, ఆశిష్ అనే ఇద్దరు విద్యార్థులు కృషి చేశారని బతికి బయటపడ్డ విద్యార్థులు చర్చించుకుంటున్నారు.
విద్యార్థులు నదిలోకి దిగి ఫోటోలు దిగుతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. విద్యార్థులు బండరాళ్ల పైన నిలబడ్డారు. వరద ఉధృతి పెరుగుతుండటాన్ని గమనించి.. చిన్న బండరాళ్ల పైన ఉన్న వారు ఒడ్డుకు వచ్చారు.
పెద్ద బండరాయి పైన ఉన్న వారు ఉధృతి తగ్గాక వెళ్లవచ్చునని భావించి ఉంటారు. అయితే ఉధృతి అంతకంతకు పెరగడంతో వారు కొట్టుకుపోయారు. ఈ సమయంలో కిరణ్, ఆశిష్ అనే ఇద్దరు విద్యార్థులు తాము కొట్టుకుపోతూ కూడా ఇతరులను కాపాడారు. ముఖ్యంగా తమకు అందుబాటులో ఉన్న అమ్మాయిలని ఒడ్డుకు చేర్చారు.
ఆ తర్వాత కిరణ్... తాను పట్టుతప్పి జారి గల్లంతయ్యాడు. రాళ్లు పట్టుకొని ఉన్న వాళ్లు ప్రవహా తీవ్రత ఎక్కువ కావడంతో క్షణాల్లో గల్లంతయ్యారు. ఈ హృదయ విదారకర దృశ్యాన్ని ఎవరో పర్యాటకులు వీడియో తీశారు. దానిని ఓ వెబ్ సైట్లో ఉంచారు. కాగా, బుధవారం మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఓపీ నాలలో మృతదేహం వెలికితీశారు. అది ఎవరిదనేది తెలియాల్సి ఉంది.