కొడాలి నానీ వ్యాఖ్యలపై: ఏపీలో ఆందోళనలు , పోలీసులకు ఫిర్యాదులు, హనుమాన్ కు వినతిపత్రాలు
ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద దుమారం రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతల, హిందూ సంఘాల నిరసనలతో రాష్ట్రం భగ్గుమంటుంది .కొడాలి నాని హిందువుల దేవాలయాలలో విగ్రహాల ధ్వంసం అయితే, తిరిగి చేయిస్తున్నాం కదా ఏమవుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై ఏపీలోని బీజేపీ నాయకులు, ధార్మిక సంఘాలు, హిందూ సంఘాలు మండి పడుతున్నాయి. పోలీస్ స్టేషన్ల లో ఫిర్యాదులకు , ఆంజనేయ స్వామికి వినతి పత్రాలు ఇవ్వటానికి సిద్ధం అయ్యారు.
తిరుమల అలిపిరి స్వామి పాదాల వద్ద బీజేపీ నేతల ఆందోళన
కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ నేడు తిరుమల అలిపిరి పాదాల వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. తిరుమల డిక్లరేషన్ వ్యవహారంలో కూడా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అని తప్పు పడుతున్నారు. తిరుమల తిరుపతి సంరక్షణ సమితి, విశ్వహిందూ పరిషత్, బిజెపి నేతలు నేడు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. హిందూ దేవుళ్ళ పై తేలిక వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, ఏసుప్రభువు కి చేయి విరిగితే ఏమౌతుందని మీడియా ముందు మాట్లాడగలరా అంటూ ప్రశ్నించారు. మసీదులో కి వెళ్ళి రామ భజన చేస్తే ఏమవుతుంది అని అడగగలరా అంటూ ఫైర్ అయ్యారు.
మంత్రి కొడాలి తగిన మూల్యం చెల్లించాలని వార్నింగ్
హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు అధికార మదంతో చేసిన వ్యాఖ్యలు గా వారు పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి బొమ్మ చెయ్యి విరిగితే ఏమవుతుంది అంటూ కొడాలి నాని విగ్రహాన్ని బొమ్మ అని పేర్కొని ఆంజనేయస్వామిని అవమానపరిచారని వారు మండిపడ్డారు. రాజకీయాలు చేస్తున్న మంత్రి కొడాలి నాని తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రగులుస్తుంది ఏపీ మంత్రి కొడాలి నానీ అని విమర్శించారు .
విశాఖలో హిందూ సంఘాల నిరసన .. మంత్రి ఫోటో కాళ్ళతో తొక్కి
కొడాలి నాని వ్యాఖ్యలపై విశాఖ డాబాగార్డెన్స్ జంక్షన్ లో విశ్వహిందూ పరిషత్, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు నేడు నిరసన చేపట్టారు. హిందూ మతాన్ని, హిందూ దేవాలయాలను, వెంకటేశ్వర స్వామిని కించపరుస్తూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంత్రి ఫోటోను కాళ్లతో తొక్కి నిరసన తెలియజేశారు. టీటీడీలో అన్యమత దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి అని చెప్పిన హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు తిరుమల డిక్లరేషన్ పై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చెయ్యనున్నారు . తక్షణం ఆయనపై పోలీసులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు .
బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్ .. ఆంజనేయ స్వామి ఆలయాల్లో వినతి పత్రాలు
కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. మంత్రి వాడిన భాష అభ్యంతరకరమని, దేవుడి పట్ల ఆ భాష సభ్యత కాదని మండిపడ్డారు. చేతికి , మెడలో రుద్రాక్షలు వేసుకున్న మంత్రి నానీ ఏం మాట్లాడుతున్నారో అర్ధం అవుతుందా అంటూ ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. హిందూ దేవాలయాలపైన, దేవుళ్ళపైన, ధర్మంపైన నోటికొచ్చినట్టు నాని మాట్లాడుతున్నారని , ఆంజనేయ స్వామి పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అన్ని ఆంజనేయస్వామి దేవాలయాలలో స్వామివారికి వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చెయ్యనున్న బీజేపీ
మంత్రి నాని పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సైతం టీడీపీ హయాంలో హిందూ దేవాలయాలను కూల్చి వేశారని, పుష్కరాల సమయంలో 30 మంది మృతి కారణమయ్యారని సోము వీర్రాజు మండిపడ్డారు. టిడిపి, వైసిపి రెండు ప్రభుత్వాల హయాంలో ఆలయాల కూల్చివేత, హిందూ ధర్మంపై దాడి కొనసాగుతోందని సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దాడులను సహించమని, హిందువులంతా ఏకమై బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.