బాలయ్య డౌన్.. డౌన్..: ఆమాత్రం ఓపిక లేదా?.. హిందూపురంలో దద్దరిల్లిన నిరసన
రాక రాక.. హిందుపురానికి వచ్చినా స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకునేంత సహనం బాలకృష్ణ ఉండటం లేదన్న ఆరోపణ వినిపిస్తోంది.
Recommended Video
హిందూపురం: సినిమాలతో బిజీగా గడిపే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఎప్పుడో గానీ అటువైపు తొంగిచూడటం లేదు. దీంతో సమస్యలతో అల్లాడుతున్న జనం ఎవరికి విన్నవించుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. రాక రాక.. హిందుపురానికి వచ్చినా స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకునేంత ఓపిక బాలకృష్ణ ఉండటం లేదన్న ఆరోపణ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే అప్పట్లో బాలకృష్ణ మిస్సింగ్ అంటూ అక్కడి ప్రజలు కేసు కూడా నమోదు చేశారు. దున్నపోతులపై బాలకృష్ణ పేరు రాసి నిరసన తెలియజేశారు. తాజాగా మరోసారి రోడ్డెక్కిన ప్రజలు బాలకృష్ణ డౌన్.. డౌన్.. అంటూ హోరెత్తించారు. సోమవారం ఎమ్మెల్యే రాక సందర్భంగా సి.వెంకటాపురం, ఓబుళాపురం, గలిబిపల్లి గ్రామాల ప్రజలు ఆయన కారుకు అడ్డుపడ్డారు.
తమ గ్రామంలో రోడ్ల సమస్య తీవ్రంగా ఉందని, నడిచేందుకు కూడా ఇబ్బందిగా మారిందని ప్రజలు బాలకృష్ణకు విన్నవించారు. దీనిపై ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకున్న దాఖలా లేదని వాపోయారు. వారి విన్నపం మేరకు స్పందించిన బాలయ్య.. అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు.
అనంతరం బిసలమానేపల్లికి చేరుకోగానే వెంకటాపురం, ఓబుళాపురం, బిసలమానేపల్లి ప్రజలు ఎమ్మెల్యే బాలకృష్ణను అడ్డుకున్నారు. తమ సమస్యలు విన్నవించేందుకు ప్రయత్నించినప్పటికీ.. బాలయ్య మాత్రం వారితో మాట్లాడకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.
బాలయ్య తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. 'ఎమ్మెల్యే బాలకృష్ణ డౌన్.. డౌన్..' అంటూ నినదించారు. తమ సమస్యకు పరిష్కారం చూపే వరకు ఇక్కడి నుంచి కదిలేదని లేదని రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆపై స్పందించిన పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.