బాలకృష్ణ ఇంటి ముందు చెత్త పోసారు : ఎందుకు వేసారంటే..!
ప్రముఖ సినీ హీరో..హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు పారిశుద్ద కార్మికులు చెత్త కుమ్మరించి అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసారు. జీవో నెంబర్ 279 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపి వ్యాప్తంగా పారిశుద్ద కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్నారు. సమ్మె చేస్తున్నారు. సమ్మెలో భాగంగా.. స్థానిక పారిశుద్ద కార్మికులు స్థానిక ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ నివాసం ముందు చెత్త పోసి తన డిమాండ్లను నినదించారు. విషయం తెలుసుకున్న పోలీసులు..ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకొని చెత్తను తీసేయించారు. ఆందోళన చేస్తున్న కార్మికుల ను అక్కడి నుండి పంపించి వేసారు.
గత అక్టోబర్ లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు జీవో నెంబర్ 279 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె కు పిలుపునిచ్చారు. అయితే, అప్పుడు దాదాపు 15 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ తరువాత ప్రభుత్వంతో జరిగిన చర్చ ల ఫలితంగా కార్మికులు సమ్మె విరమించారు.
కానీ, ఇప్పటి వరకు జీవో రద్దుకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి చర్యలు లేవు. తమకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని..అప్పటి వరకు 279 జీవో ప్రకారమే పని చేయాలని అధికారులు కార్మికులకు స్పష్టం చేసారు. దీంతో..కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టారు. తమ నిరసన తీవ్రతను తెలియచేస్తూ..హిందూపురంలో బాలకృష్ణ నివాసం ముందు చెత్త పోసారు. తమకు న్యాయం జరిగే వరకూ సమ్మె కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేసారు. బాలకృష్ణ నివాసం ముందు కార్మికుల నిరసన విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి చేరుకున్నారు.