జగన్ పై బాలయ్య అస్త్రం..రంగంలోకి హిందూపురం ఎమ్మెల్యే..చంద్రబాబు స్ట్రాటజీ
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా రంగంలోకి దిగబోతున్నారు.ఎవరూ ఊహించని విధంగా బాలయ్య జగన్ ను టార్గెట్ చేసే అంశం ఏంటి? ముఖ్యంగా బాలకృష్ణను టిడిపి అధినేత చంద్రబాబు ఎందుకు రంగంలోకి దింపాలనుకుంటున్నారు? అన్నవి ప్రస్తుతం అందరికీ ఆసక్తికరం గా మారిన ప్రశ్నలు.
ఏపీలో రచ్చగా మారుతున్న తెలుగు మీడియం తీసివేత నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తెలుగు మీడియం తీసివేత నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు కారణం అవుతుంది. భాషా ప్రయుక్త రాష్ట్రంలో తెలుగులో బోధన తీసివేయడం సమంజసం కాదు అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ అధికారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలపై తిరిగి మాటల దాడి చేస్తుంది తప్ప, తెలుగు మీడియం తీసివేత నిర్ణయాన్ని మాత్రం ఉపసంహరించుకోలేదు.
అసెంబ్లీ సమావేశాల్లో జగన్ టార్గెట్ గా బాలయ్య అస్త్రం
ఇంగ్లీష్ మీడియంలో బోధన విధానానికి ప్రతిపక్ష పార్టీలు సైతం సానుకూలంగానే ఉన్నాయి. కానీ తెలుగు మీడియంలో బోధన విధానాన్ని తీసివేయడం, తెలుగు భాషను ప్రమాదంలో పడేయడమే అన్న ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు.అందుకే డిసెంబర్ 9 నుండి జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలను సీఎం జగన్మోహన్ రెడ్డిని తెలుగు మీడియం విషయంలో ఇరకాటంలో పెట్టడానికి చంద్రబాబు బాలయ్య అస్త్రాన్ని ప్రయోగించబోతున్నాడు .
అసెంబ్లీ వేదికగా తెలుగు మీడియంపై బలమైన వాణి వినిపించాలనే ఆలోచన
ఇంతకాలం తెలుగు తమ్ముళ్ళు అంతా ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాలకే పరిమితం అవుతున్నారని తెగ బాధ పడుతున్న తరుణంలో సరైన సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బాలయ్య ను రంగంలోకి దించి జగన్ ను ఇబ్బంది పెట్టాలని, తెలుగు మీడియం విషయంలో అసెంబ్లీ వేదికగా టిడిపి వాయిస్ వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలుగు కోసం పోరాటం ..బరిలోకి హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య
సీఎం జగన్ తీసుకొచ్చిన తప్పనిసరి ఇంగ్లీష్ మీడియం పై టీడీపీ పోరాడుతోంది. తాము ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని, తెలుగును కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని మొదటి నుంచి టిడిపి చెబుతోంది. ఇంగ్లీష్ మీడియం బోధన విధానాన్ని ప్రవేశ పెడుతున్న ఏపీ సర్కార్, తెలుగు మీడియం తీసివేయాలన్న వివాదం విషయంలో బాలయ్యను ప్రయోగించనున్నారు చంద్రబాబు. డిసెంబర్ 9 నుండిఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఇంగ్లీష్ మీడియం అంశాన్ని లేవనెత్తి దానిపై హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యతో ప్రభుత్వం మీద విమర్శలు చేయించాలని టీడీపీ వ్యూహం రచించినట్టు సమాచారం.
గతంలో తెలుగు కోసం హరి కృష్ణ .. ఇప్పుడు బాలకృష్ణ
తెలుగు భాష అంటే ఎక్కువ మక్కువ చూపే బాలయ్య భాషకు, సంస్కృతికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. వాటి గొప్పతనాన్ని బాలయ్య చాలా చక్కగా చెప్పగలరు. కాబట్టి బాలయ్య అయితేనే అందుకు సరిపోతాడని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పార్లమెంటులో అప్పటి రాజ్యసభ టీడీపీ ఎంపీ హరికృష్ణ అచ్చతెలుగులో మాట్లాడి తెలుగువారి ఔన్నత్యాన్ని, తెలుగు భాష గౌరవాన్ని చాటిచెప్పారని అప్పట్లో చాలామంది అభిప్రాయపడిన పరిస్థితి. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో బాలయ్యతో తెలుగు గొప్పతనం చెప్పించి అదే సీన్ రిపీట్ చేయించేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది.