దర్శనమే కరువయ్యే!: 'బాలయ్య' షూటింగ్స్ బిజీతో అల్లాడుతున్న హిందూపురం..
గత జనవరిలో జాతీయ కరువు దర్యాప్తు బృందం నియోజకవర్గంలో పర్యటించిన సమయంలోను ఎమ్మెల్యే అందుబాటులో లేరు.
హిందూపురం: ఏకకాలంలో అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమైన పనే. ఒక్కసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన తర్వాత జనంతో ఎడం పెరిగితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. సినిమాలకు మాత్రమే డేట్స్ కేటాయిస్తూ.. నియోజకవర్గం వైపు తొంగి చూడకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.
టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సినిమా షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్న బాలయ్య.. నియోజకవర్గాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. ఇప్పటికీ ఆయన నియోజకవర్గం ముఖం చూడక దాదాపు ఎనిమిది నెలలు అవుతోందట.
సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో.. ఎవరి పరిష్కరిస్తారో తెలియక అక్కడి జనం తలలు పట్టుకుంటున్నారు. ఏరి కోరి గెలిపించుకుంటే.. ఇలాంటి పరిస్థితి తలెత్తిందేంటని ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికీ 8 నెలలు, ఇంకెన్ని రోజులు:
ఎమ్మెల్యే బాలయ్య దర్శనం కోసం హిందూపురం నియోజకవర్గ ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. మరో 40రోజుల పాటు ఆయన సినిమా షూటింగ్స్ లోనే బిజీగా ఉంటారని తెలియడంతో.. ఇప్పట్లో ఆయన రాక కష్టమేనని భావిస్తున్నారు. నిజానికి గత జనవరిలో నియోజకవర్గంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమానికి బాలయ్య వస్తారనుకున్నారు. కానీ ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.
కరువుతో అల్లాడుతున్న జనం:
ఎమ్మెల్యే బాలయ్య అందుబాటులో ఉండకపోతుండటంతో.. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ప్రజలు తమ సమస్యకు పరిష్కారం ఎవరు చూపిస్తారో అర్థం కాక తలపట్టుకున్నారు. గత జనవరిలో జాతీయ కరువు దర్యాప్తు బృందం నియోజకవర్గంలో పర్యటించిన సమయంలోను ఎమ్మెల్యే అందుబాటులో లేరు. జిల్లాకు చెందిన మిగతా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో నెలకొన్న నీటి ఎద్దడిపై జాతీయ కరువు దర్యాప్తు బృందానికి తమ అభ్యర్థనలు విన్నవించారట. ఎమ్మెల్యే బాలయ్య అందుబాటులో లేకపోవడంతో.. హిందూపురం గురించి పట్టించుకున్నవారే లేరని అక్కడి జనం వాపోతున్నట్లు తెలుస్తోంది.
పీఏ వివాదం సమయంలోను:
ఎమ్మెల్యే బాలయ్య పీఏ శేఖర్ ఆగడాలు హెచ్చుమీరుతున్నాయంటూ గతంలో నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతల్లో అసమ్మతి రాజుకున్న సంగతి తెలిసిందే. రహస్య బేటీలు పెట్టి మరీ పీఏ శేఖర్ ను తరిమికొడుతామంటూ వారంతా ఒక్కటయ్యారు. ఇలాంటి తరుణంలోనైనా.. బాలయ్య నియోజకవర్గంలో అడుగుపెడుతారని భావించినప్పటికీ.. ఆయన ఫోన్ల ద్వారానే వ్యవహారాన్ని చక్కబెట్టారు తప్పితే అటువైపు తొంగి కూడా చూడలేదని చెబుతున్నారు.
గతంలో మిస్సింగ్ కేసు:
నియోజకవర్గ ప్రజలకు బాలయ్య అందుబాటులో లేకపోతుండటంతో.. ఆయనపై గతంలో ప్రతిపక్ష నేతలు మిస్సింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరోసారి దున్నపోతులపై ఆయన పేరు రాసి నిరసన తెలియజేశారు. ఇంత జరుగుతున్నా.. బాలయ్య మాత్రం హిందూపురంలో అడుగుపెట్టేందుకు టైమ్ కేటాయించలేకపోతున్నారు. దీంతో ఆయనపై రోజురోజుకు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఏర్పడింది. మరి ఇప్పటికైనా బాలయ్య నియోజకవర్గం పట్ల అప్రమత్తంగా వ్యవహారిస్తారో! లేక ఇదే తీరును కొనసాగిస్తారో! వేచి చూడాలి.